సాక్షి, మహబూబ్నగర్ : తెలంగాణలో 23 రోజుల పసికందుకు కరోనా వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మహబూబ్నగర్ జిల్లాలో కొత్తగా మూడు కరోనా కేసులు నమోదు కాగా, అందులో 23 రోజుల పసికందు కూడా ఉన్నట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. మర్కజ్కు వెళ్లివచ్చిన వారి ద్వారా వీరికి కరోనా సోకినట్టు కలెక్టర్ తెలిపారు. అయితే ప్రస్తుతం కరోనా పాజిటివ్గా తేలిన ముగ్గురి ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. కాగా, తెలంగాణలో ఓ పసికందుకు కరోనా సోకడం ఇదే ప్రథమం.(లక్షణాలు లేకుండానే కోవిడ్-19 దాడి..)
మరోవైపు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా నమోదు అవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువ మంది ఢిల్లీ మర్కజ్తో సంబంధం ఉన్నవారు కావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అధికారులు మర్కజ్ వెళ్లివచ్చినవారిని గుర్తించి ప్రతి ఒక్కరికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే మర్కజ్ వెళ్లివచ్చిన వారి కుటుంబ సభ్యులు, వారితో సన్నిహితంగా మెలిగినవారిని క్వారంటైన్లకు తరలిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితులను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.(‘పరిస్థితి భయంకరంగా ఉంది.. మాట్లాడలేను’ )