ముగిసిన తహసీల్దార్ల బదిలీ ప్రక్రియ

19 Nov, 2019 02:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ల బదిలీ ప్రక్రియ ముగిసింది. గతేడాది శాసనసభ ఎన్నికల నేపథ్యంలో వివిధ జిల్లా లకు బదిలీ చేసిన తహసీల్దార్లను తిరిగి పాత జిల్లాలకు పంపుతూ ఆదివారం భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే కేటాయించిన జిల్లాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు 378 మంది ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాల నుంచి రిలీవ్‌ కావడం.. పూర్వపు జిల్లాల్లో రిపోర్టు చేయడం.. మండలాల వారీగా పోస్టింగ్‌లు తీసుకోవడం జరిగిపోయాయి.

మూడేళ్లు ఒకేచోట, సొంత జిల్లా ల్లో పనిచేస్తున్న తహసీల్దార్లను ఈసీ ఆదేశాల మేరకు ఇతర జిల్లాలకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంగా కుటుంబాలకు దూరంగా విధులు నిర్వర్తిస్తున్న తహసీల్దార్లను తిరిగి పాత జిల్లాల్లో నియమించాలని గత కొన్నాళ్లు రెవెన్యూ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య అనంతరం ఈ డిమాండ్‌ మరోసారి తెరపైకి రావడంతో స్పందించిన ప్రభుత్వం బదిలీ ప్రక్రియను పూర్తి చేసింది.  

మరిన్ని వార్తలు