ఇంద్రవల్లి (ఆదిలాబాద్) : ప్రయాణికులను దించేందుకు రోడ్డు పక్కన నిలిచి ఉన్న బస్సును వెనుక నుంచి వస్తున్న మరో బస్సు ఢీకొట్టింది. దీంతో వెనుక ఉన్న బస్సులోని పలువురు ప్రయాణికులకు గాయాలు కాగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవల్లిలో సోమవారం చోటుచేసుకుంది.
ఆదిలాబాద్ నుంచి కాగజ్నగర్ వెళ్తున్న ఆర్డినరీ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న సమయంలో అదిలాబాద్ నుంచి మంచిర్యాల వెళ్తున్న ఎక్స్ప్రెస్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఎక్స్ప్రెస్ బస్సులో ఉన్న నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు 108 సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.