‘షేర్‌’ చేసుకుంటున్నారు..

30 Dec, 2018 03:12 IST|Sakshi

షేర్‌ చాట్‌ యాప్‌లో 4 లక్షల మంది తెలుగువారు

సాక్షి, హైదరాబాద్‌: ‘షేర్‌ చాట్‌’ఇది ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వాడే యువతకు పరిచయం అక్కర్లేని యాప్‌. యువతే కాదు.. విద్య, వ్యాపారం, ఉద్యోగం ఇలా ఏ రంగాల వారైనా సరే వారి మనోభావాలు, కళాత్మక నైపుణ్యం, మాటలు, వీడియోలు, సరదా సన్నివేశాలు ప్రపంచానికి పరిచయం చేసుకునేందుకు ఏర్పాటైన గొప్పవేదిక. ప్రస్తుతం ఆసియాలో అగ్రస్థానాన ఉన్న సామాజిక మాధ్యమాల్లో షేర్‌చాట్‌ ఒకటి. తెలంగాణ, ఏపీల్లో కూడా షేర్‌చాట్‌ను వినియోగించే వారి సంఖ్య భారీగానే ఉంది. 2018 వరకు ఈ యాప్‌లో 4 లక్షల మంది తెలుగు ప్రజలు ఖాతాలు తెరిచినట్లు గురువారం సంస్థ సీఈవో అంకుశ్‌ సచ్ఛ్‌దేవ తమ నివేదికలో తెలిపారు. తమ షేర్‌చాట్‌లో 2018 ఏడాదిలో జస్టిస్‌ ఫర్‌ ఆసిఫా, తిత్లీ తుఫాన్, ఏపీకి ప్రత్యేక హోదా, తెలంగాణ ఎన్నికల వంటి అంశాలపై షేర్‌ చాట్‌ వేదికగానే ఎక్కువగా వైరల్‌గా మారాయని చెప్పారు. 

షేర్‌చాట్‌ వచ్చిందిలా.. 
ప్రాంతీయ భాషల్లో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సేవలు అందిస్తున్న బెంగళూరు సంస్థ షేర్‌చాట్‌.. ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థుల సృష్టి. యాప్స్‌ ఇంగ్లిష్‌లో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి అర్థం కాకపోవడంతో వీటిపై పెద్దగా ఆసక్తి కనబర్చట్లేదు. ఈ లోటును గమనించిన ఐఐటీ కాన్పూర్‌కు చెందిన విద్యార్థులు ఫరీద్‌ హసన్, అంకుశ్‌ సచ్‌దేవ, భాను సింగ్‌లు బెంగళూర్‌ కేంద్రంగా 2015లో షేర్‌చాట్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14 ప్రాంతీయ భాషల్లో మొత్తం 3 కోట్ల మంది వినియోగదారులున్నారు.  

మరిన్ని వార్తలు