55 ఏళ్లు పైబడిన వారే సగం!

6 May, 2020 03:21 IST|Sakshi

కరోనాతో చనిపోయిన వారిలో వీరే 14 మంది

వైరస్‌ సోకుతున్న వారిలో సింహభాగం 40 ఏళ్లలోపు వారే..

మొత్తం కేసులో 85 శాతం మర్కజ్‌ లింకులు

కంటైన్మెంట్‌ జోన్లలో క్వారంటైన్‌లో 45,639 కుటుంబాలు

సాక్షి, హైదరాబాద్‌: వృద్ధులపై కరోనా పంజా విసురుతోంది. ఈ వైరస్‌ ధాటికి వృద్ధులే అత్యధికంగా మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వ లెక్కల(ఈ నెల 3న విడుదల చేసిన) ప్రకారం..రాష్ట్రంలో కరోనా బారినపడి  చనిపోయిన వారిలో 40–45 ఏళ్ల వ యసు వారు 11(39%) మంది, 55– 65 ఏళ్ల మధ్య వారు ఆరుగురు(21%), 65 ఏళ్ల పైబ డినవారు 8 (29%) మంది ఉండగా, 20–40 ఏళ్ల మధ్య ఒకరు (4%), ఐదేళ్లలోపు చిన్నారులు ఇద్దరు ఉన్నారు.

రికవరీలో భేష్‌
కరోనా కట్టడిలో మన రాష్ట్రం జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉంది. జాతీయ స్థాయిలో మరణాల రేటు 3.25%(1,301) ఉండగా.. మన రాష్ట్రంలో 2.69% (29) నమోదైంది. అలాగే ఈ వైరస్‌ నుంచి కోలుకున్నవారిలో దేశ వ్యాప్తంగా పోలిస్తే ఇక్కడ దాదాపు రెట్టింపు స్థాయిలో ఉంది. జాతీయ స్థాయిలో 26.6 శాతం ఉంటే.. మన రాష్ట్రంలో 46.33% నమోదైంది. వైరస్‌ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి మెరుగైన చికిత్స అందించడంతో ఇది సాధ్యపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

యువరక్తమే అధికం..
కరోనా మహమ్మారి మన రాష్ట్రం లో యువతపై అధికంగా ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 41% యువతే ఉంది. వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన వారిలో 20–40 ఏళ్ల మధ్య వారు 431 మంది ఉండగా, 40–55 ఏళ్ల వారు 235 (22 శాతం) మంది, 55–65 ఏళ్లలోపు గల 121 (11%) మంది, 65 ఏళ్లపైబడిన 49 (5%) మంది ఉన్నారు. అలాగే ఐదేళ్లలోపు చిన్నారు లు 50 (5%) మంది, 5–10 ఏళ్ల మధ్య 40 (4%) మంది, 10–20 ఏళ్ల మధ్య వారిలో 137(13%) మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిలో 704 (66%) పురుషులు కాగా, 359 మంది (34%) మంది మహిళలున్నారు.

ఇప్పటికీ టాప్‌లో మర్కజ్‌
ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. మర్కజ్‌కు ముందు దేశంలో పదుల సంఖ్యలోనే కేసులు నమోదు కాగా, ఆ తర్వాత వందల సంఖ్యకు చేరింది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 85 శాతం మర్కజ్‌ లింకులున్నవే కావడం గమనార్హం. మర్కజ్‌ యాత్రికుల కాంటాక్టు కేసులు 670 (63%) నమోదుకాగా, మర్కజ్‌ యాత్రికులవి 235 (22%), ఇతరుల ద్వారా వైరస్‌ సంక్రమించిన వాళ్లు 36 మంది, విదేశాల నుంచి వచ్చిన వారిలోనూ 36 మందికి కరోనా పాజిటివ్‌ తేలింది. వైద్య సిబ్బందికి కూడా కొందరికి పాజిటివ్‌ వచ్చింది. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి 31 మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులకు వైరస్‌ వ్యాప్తి చెందింది. 33 మంది ఇతరులు కూడా దీని బారిన పడ్డారు. అయితే, వీరికి ఎవరి నుంచి ఈ వైరస్‌ సోకిందనే విషయం తేలక వైద్య, ఆరోగ్యశాఖ తలపట్టుకుంది.

కంటైన్మెంట్లో 45వేల కుటుంబాల పైమాటే
కోవిడ్‌ నియంత్రణకు రాష్ట్ర వ్యాప్తంగా 97 క్లస్టర్లలో ప్రభుత్వం కంటైన్మెంట్‌ చేస్తోంది. ఈ కంటైన్మెంట్‌ జోన్లలో 46 జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉండగా, 51 ఇతర జిల్లాల్లో ఉన్నాయి. కాగా, ఈ కంటైన్మెంట్‌ జోన్ల పరిధిలోకి మొత్తం 45,639 కుటుంబాలు ఉన్నాయని, ఇందులో జిల్లాల్లో 43,610 కుటుం బాలు, జీహెచ్‌ఎంసీలో 2,029 కుటుంబాలున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. కాగా, కంటైన్మెంట్‌ జోన్ల పరిధిలో ఆంక్షలు కఠినంగా అమలు చేయనున్నారు.

మరిన్ని వార్తలు