సీపీ సజ్జనార్‌ ఇంట్లో పాము కలకలం

28 Mar, 2020 12:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఇంట్లో పాము కలకలం రేపింది. శుక్రవారం ఓ ఐదు అడుగుల పాము సజ్జనార్‌ ఇంట్లోకి చొరబడింది. అది గమనించిన ఆయన పాములు పట్టడంలో నిష్ణాతుడైన కానిస్టేబుల్‌ వెంకటేశ్‌ నాయక్‌ను పిలిపించారు. పాములు పట్టడంలో అందెవేసిన చెయ్యని ఆ కానిస్టేబుల్‌కు డిపార్టు్‌మెంట్‌లో పేరుంది. సజ్జనార్‌ ఇంటికి చేరుకున్న వెంకటేశ్‌ పామును చాకచక్యంగా పట్టి బ్యాగులో వేసుకున్నాడు. దానికిఎలాంటి హానీ తలపెట్టకుండా నెహ్రూ జూలాజికల్‌ పార్కులో అప్పజెబుతానని చెప్పాడు. పామును పట్టి దానితో పాటు తమ ప్రాణాలను రక్షించినందుకు సీపీ సంతోషం వ్యక్తం చేశారు.

కానిస్టేబుల్‌ ప్రతిభకు మెచ్చి నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. ‘ఎవరైనా పామును చూడగానే భయపడిపోయి దాన్ని చంపటానికి ప్రయత్నించకూడదు. దానికి బదులుగా పాములను రక్షించే సిబ్బందికి సమాచారం అందించాలి. ఈ భూమ్మీద ఉన్న ప్రతీ జీవికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. మనం వాటికి హాని చేయనంత వరకు అవి మనకు హాని చేయవ’ని అన్నారు.

మరిన్ని వార్తలు