తాళం వేసిన ఐదిళ్లల్లో చోరీ

12 Aug, 2019 13:25 IST|Sakshi
ఇంట్లోని బీరువాను ధ్వంసం చేసిన దుండగులు

సాక్షి, నిజామాబాద్‌(ఆర్మూర్‌) : మండలంలోని రాంపూర్‌లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీకి ఎగబడ్డారు. దుండగులు గ్రామంలోని ఐదు ఇళ్లలో శనివారం అర్ధరాత్రి చోరీ చేసి నగదు, నగలను ఎత్తుకెళ్లారు. ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగు చూసింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇంటికి తాళాలు వేసి ఊరికి వెళ్లిన హైమద్‌ ముక్తార్, ఈరోళ్ల సాయన్న, ఈరోళ్ల రమేశ్, కే. హరీష్‌ ఇళ్లతో పాటు బీడీ ఖార్ఖానాలో దొంగలు చోరీ చేశారు. నలుగురి ఇళ్ల తాళాలను ధ్వంసం చేసి లోనికి చొరబడి బీరువాను తెరిచి నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. హైమద్‌ ముక్తార్‌ ఇంట్లో నుంచి రూ.లక్షన్నరతో పాటు ఐదు తులాల బంగారం, కే. హరీష్‌ ఇంట్లో నుంచి ఆరు బంగారు ఉంగరాలు, మూడు జతల బంగారు కమ్మలు, ఈరోళ్ల సాయన్న ఇంట్లో నుంచి రూ.4 వేలు, ఈరోళ్ల రమేశ్‌ ఇంట్లో నుంచి రూ.8 వేల నగదు చోరీకి గురైనట్లు తెలిసింది. దుండగులు ముందే పక్కాగా రెక్కీ నిర్వహించి చోరీ చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు సంచరించినట్లు గ్రామస్తులు తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి వచ్చిన క్లూసీం టీం చోరీ జరిగిన ఇళ్లలో ఆధారాలు సేకరించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చోరీ తీరును పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటు ఎస్‌హెచ్‌వో రాఘవేందర్‌ తెలిపారు.   

 

మరిన్ని వార్తలు