రవాణాలో 6.7 శాతం వృద్ధి

2 Jun, 2017 02:24 IST|Sakshi

గోదావరిఖని/రుద్రంపూర్‌: 2017–18 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి నిర్దేశించుకున్న 660 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధన దిశగా యాజమాన్యం ముందుకెళుతోంది. ప్రణాళిలతో నెలవారీ లక్ష్యాలను అధిగమిస్తోంది. మే లో 50.5 లక్షల టన్నుల ఉత్పత్తి చేసి.. గత ఏడాది ఇదే నెలలో సాధించిన దాన్ని కన్నా 2.85 శాతం వృద్ధిని సాధించింది. ఇక బొగ్గు రవాణాలో కూడా 6.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది మేలో 49.2 లక్షల టన్నులు రవాణా చేయగా.. ఈ ఏడాది 52.5 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయడం గమనార్హం.

 ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో ఓవర్‌ఒర్డెన్‌ తొలగింపులో ఏకంగా 21.57 శాతం వృద్ధిని సాధించి ఆశ్చర్యానికి గురిచేసింది. 2016 ఇదే నెలలో 274 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓవర్‌ బర్డెన్‌ను వెలికితీయగా.. ఈ ఏడాది 333 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓబీని తొలగించింది. ఎండాకాలంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు గరిష్ట స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తాయి. కనుక ఈ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని ఏరియాల్లో ఉత్పత్తి,

 రవాణాను గరిష్ట స్థాయిలో జరిపారు. తద్వారా సింగరేణి ద్వారా బొగ్గును కొనుగోలు చేస్తున్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు తమ సామర్థ్యం మేరకు బొగ్గును వినియోగించి.. తగినంత గ్రౌండ్‌ స్టాకును కూడా నిల్వ చేసుకున్నాయి. బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్‌ బర్డెన్‌ తొలగింపులో మేలో సాధించిన ప్రగతిపై సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ అన్ని ఏరియాల అధికారులు, కార్మికులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇకపై ప్రతి నెలా స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు.

మరిన్ని వార్తలు