నేషనల్‌ పూల్‌లో మిగిలిన ఎంబీబీఎస్‌ సీట్లు 67

31 Jul, 2019 02:22 IST|Sakshi

వాటిని తిరిగి తెలంగాణకు కేటాయించిన కేంద్రం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల నుంచి నేషనల్‌ పూల్‌కి ఇచ్చిన 15% కోటా ఎంబీబీఎస్‌ సీట్లలో కొన్ని మిగిలిపోయాయి. దీంతో వాటిని తిరిగి రాష్ట్రానికి కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో మెడికల్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులకు ప్రభుత్వ సీట్లు దక్కనున్నాయి. నేషనల్‌ పూల్‌కు రాష్ట్రం నుంచి 225 ఎంబీబీఎస్‌ సీట్లు కేటాయించగా, జాతీయ స్థాయిలో వాటికి 2 కౌన్సెలింగ్‌లు నిర్వహించారు. వాటిలో 158 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.

67 సీట్లు మిగిలినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ తెలిపింది. జాతీయ స్థాయిలో 2 కౌన్సెలింగ్‌లు నిర్వహించాక మిగిలిపోయే సీట్లను ఆయా రాష్ట్రాలకు తిరిగి కేటాయించాలన్న నిబంధన ఉంది. ఆ ప్రకారం 2 కౌన్సెలింగ్‌లు పూర్తవడంతో మిగిలిన సీట్లను కేంద్రం తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో రాష్ట్రస్థాయిలో నిర్వహించే మూడో విడత కౌన్సెలింగ్‌లో మరికొందరు విద్యార్థులకు ఈ సీట్లను కేటాయించే అవకాశం ఏర్పడింది. కన్వీనర్‌ కోటా సీట్లకు రాష్ట్రంలో మూడో విడత కౌన్సెలింగ్‌ వచ్చే నెల 1న ప్రారంభం కానుంది.

మరిన్ని వార్తలు