నీటిగుంతలో పడి చిన్నారి మృతి

15 Aug, 2015 18:40 IST|Sakshi

బాసర (ఆదిలాబాద్) : ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ నీటి గుంతలో పడి మృతిచెందింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బాసరలోని రైల్వే స్టేషన్‌కు సమీపంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బాసరకు చెందిన కాగడ విజయలక్ష్మి(7)  స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. కాగా శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కారణంగా పాఠశాలకు సెలవు కావడంతో ఇంటి వద్దే ఆడుకుంటోంది.

కాగా ఇంటి పక్కన గోదావరి పుష్కరాల ఏరాట్లలో భాగంగా వాహనాల పార్కింగ్ కోసం కొన్ని గుంతలు తవ్వారు. పుష్కరాల అనంతరం వాటిని పూడ్చకుండా అలాగే వదిలేశారు. రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో.. ఆ గుంతల్లో నీళ్లు నిలిచాయి. ఇది గమనించని చిన్నారి ఆడుకుంటూ వెళ్లి నీటి గుంతలో పడి మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు