భూసార మెంతో తేలుతుందిక..

18 Nov, 2019 04:03 IST|Sakshi

15 జిల్లాల్లో 711 మినీ భూసార పరీక్షా కేంద్రాలు

ఫలితాల ఆధారంగానే ఎరువుల పంపిణీ

ఈ కేంద్రాలతో గ్రామీణ యువతకు దొరకనున్న ఉపాధి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 711 మినీ భూసార పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయా లని వ్యవసాయశాఖ నిర్ణయించింది. 15 జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో వీటిని నెలకొల్పుతారు. ఎరువుల దుకాణదారులు భూ సార పరీక్షా ఫలితాలు, ఆధార్‌ కార్డుల ఆధారంగానే ఎరువులు విక్రయించాలన్న మార్గదర్శకాల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. భూసార కార్డులను అనుసంధానిత ఎరువుల నిర్వహణ వ్యవస్థ (ఐఎఫ్‌ఎమ్‌ఎస్‌)కు జత చేసేందుకు భూసార వెబ్‌సైట్‌లో రైతుల ఆధార్‌ నంబర్, సర్వే నంబర్లను నమోదు చేస్తారు. ప్రస్తుతం క్లస్టర్ల వారీగా వ్యవసాయ విస్తరణ అధికారులు మట్టి నమూనాలు సేకరించి ఫలితాలను వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు. ఇటీవల వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు సర్వే, రైతు సమన్వయ సమితులు వంటి వాటితో పని ఒత్తిడి పెరిగి, మట్టి నమూనాల సేకరణ మందగించిం ది. రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 12, వ్యవసాయ మార్కెటింగ్‌లలో 28, సంచార భూసార కేంద్రాలు 4, మినీ భూసార పరీక్షా కేంద్రాలు 2,050 ఉన్నాయి. వాటికితోడు గ్రామస్థాయిలో మరిన్ని రాబోతున్నాయి.

యువతకు ఉపాధి 
కేంద్రం గ్రామీణ యువతకు ఉపాధి కల్పించే పథకంలో భాగంగా 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల లోపున్న యువకులకు ఈ కేంద్రాలను మం జూరు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 నుంచి 40 శాతం చొప్పున నిధులు సమకూర్చుతాయి. యువతకు 75 శాతం సబ్సిడీతో మినీ భూసార కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తున్నారు. మిగతా 25 శాతం లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. గ్రామ స్థాయిలో సాగయ్యే భూమిలో ఆరున్నర ఎకరాలకు ఒక మట్టి నమూనాను తీసుకోవాల్సి ఉంటుంది.

మినీ భూసార కేంద్రాన్ని ఏర్పా టు చేయాలనుకునే వారు పదో తరగతి పాసై ఉండాలి. రైతులందరికీ భూసార కార్డులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖను ఆదేశించింది. కానీ ఆచరణలో మాత్రం అమలుకావడం లేదన్న ఆరోపణలున్నాయి. 2018–19లో 4,72,987 మట్టి నమూనాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇందులో 4,70,875 ఫలితాల ను పరీక్షించి ఆన్‌లైన్‌ చేశారు. మొత్తం 23,91,395 భూసార కార్డులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటి లో 10 లక్షల కార్డులు మాత్రమే రైతులకు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.  

మరిన్ని వార్తలు