భర్త చనిపోయాడనే మనస్తాపంతో.. 

9 May, 2018 08:45 IST|Sakshi

లంగర్‌హౌస్‌:   భర్త చనిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వృద్ధురాలు(80)  భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై జగన్‌ తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు పట్టణంలో నివాస ముండే జానకమ్మ, వెంకటేశ్వర్లు భార్యభర్తలు.   వారి కుమారుడు రాంచందర్‌ సంవత్సరం క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చి లంగర్‌హౌస్‌ బాపూనగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు.జానకమ్మ భర్త వెంకటేశ్వర్లు గత సంవత్సరం ఆగస్టులో అనారోగ్యంతో మృతి చెందాడు.

అప్పటి నుంచి జానకమ్మ లంగర్‌హౌస్‌లోని కుమారుని వద్దనే ఉంటుంది. భర్త బతికి ఉండగానే భార్య చనిపోవాలని, తన భర్తే మొదట చనిపోయాడని జాన కమ్మ తీవ్ర మనోవేదనకు గురయ్యేది. ఇక తాను బతకలేనంటూ అందరికి చెబుతూ బాధపడేది.. పొలం పనులు చూసుకునేందుకు కుమారుడు  పది రోజుల క్రితం ఒంగోలు వెళ్లాడు. కోడలు మంగళవారం ఉదయం సంగమం దేవాలయానికి వెళ్లింది.  ఇంట్లో ఎవరు లేని విషయం గమనించిన జానకమ్మ రెండతస్తుల భవనం పైకి ఎక్కి అక్కడ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.  

మరిన్ని వార్తలు