తగ్గినట్లే తగ్గి..

30 May, 2020 09:05 IST|Sakshi
ఎమ్మెల్యే కాలనీలో పర్యటిస్తున్న డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌

మళ్లీ విజృంభిస్తున్న కరోనా

నాదర్‌గూల్, మీర్‌పేట్,బడంగ్‌పేట్, లెనిన్‌నగర్‌లో కొత్త కేసులు

శుక్రవారం గ్రేటర్‌లో 82 పాజిటివ్‌ కేసులు

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని పాత కంటైన్మెంట్ల పరిధిలో కరోనా కేసుల తీవ్రత తగ్గినప్పటికీ...ప్రస్తుతం రోజుకో కొత్త ప్రాంతంలో వైరస్‌ వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగి స్తోంది. వీటికి మూలాలు కూడా దొరకడం లేదు. దీనికితోడు వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిన బాధితుల్లో 80 శాతం మందిలో వైరస్‌ లక్షణాలు కనిపించక పోవడంతో కుటుంబ సభ్యుల్లో ఎవరికి వైరస్‌ ఉందో? ఎవరికి లేదో? గుర్తించడం కష్టంగా మారింది.కాగా శుక్రవారం రికార్డు స్థాయిలో 82 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి రావడం సిటీజనులను కలవరపెడుతోంది.

కింగ్‌కోఠిలో 11 మందికి పాజిటివ్‌:
కింగ్‌కోఠి ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో ఉన్న 11 మందికి పాజిటివ్‌ వచ్చింది. నెగిటివ్‌ వచ్చిన మరో 10 మందిని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 153 మంది అనుమానితులు ఉన్నారు. వీరిలో మరో 17 మంది రిపోర్టులు రావాల్సి ఉంది.  నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో కొత్తగా మరో 17 మంది అనుమానితులు రాగా, వైద్యులు వారిని ఐసోలేషన్‌ వార్డులో అడ్మిట్‌ చేశారు. స్వాబ్స్‌ సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపుతున్నారు. ఇక ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రి సహా ఆయుర్వేద ఆస్పత్రులు ఖాళీ అయ్యాయి. 

పహాడీషరీఫ్‌లో మరో ఆరుగురికి..
పహాడీషరీఫ్‌: పహాడీషరీఫ్‌ గ్రామంలో శుక్రవారం మరో ఆరుగురు వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. దీంతో  గ్రామంలో కరోనా బాధితుల కేసుల సంఖ్య 28కి చేరింది. మటన్‌ వ్యాపారి బంధువుల ద్వారా ఈ నెల 26న 14 మందికి పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. వారితో ప్రైమరీ కాంటాక్ట్‌గా ఉన్న 35 మందికి పరీక్షలు నిర్వహించగా మరో 14 మందికి పాజిటివ్‌గా తేలింది. వారితో సెకండరీ కాంటాక్ట్‌గా ఉన్న 45 మందిని హోం క్వారంటైన్‌ చేశారు. 

ఒకే కుటుంబంలో నలుగురికి..
జూబ్లీహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని ఎమ్మెల్యే కాలనీలో కరోనా కలకలం రేపింది. ఒకే కుటుంబంలో నలుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ అధికారులు శుక్రవారం కాలనీలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. వివరాల్లోకి వెళితే ఎమ్మెల్యే కాలనీలోని వీ6 వీధిలో ఉంటున్న ఓ కుటుంబ సభ్యులు పది రోజుల క్రితం కొంపల్లిలో ఉంటున్న తమ బంధువు మృతి చెందడంతో అక్కడికి వెళ్లి వచ్చారు. మూడు రోజుల క్రితం కుటుంబంలోని యువకుడి(17)కరోనా లక్షణాలు కనిపించడంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాజిటివ్‌గా నిర్ధారించారు. దీంతో అతడి కుటుంబంలోని మిగతా ముగ్గురిని కూడా పరీక్షించగా వారికి కూడా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారిని అదే ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 

కుద్భిగూడలో ఒకరికి...
కాచిగూడ: కుద్భిగూడలో ఓ వ్యక్తి(57)కి శుక్రవారం కరోనా పాజిటివ్‌ రావడంతో అతడిని గాంధీ అసుపత్రికి తరలించిన అతడి ఇంటిని క్వారంటైన్‌ చేశారు.  

రిసాల అబ్దుల్లా ప్రాంతంలో మహిళకు..
అఫ్జల్‌గంజ్‌: అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రిసాల అబ్దుల్లా ప్రాంతానికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో శుక్రవారం ఆమెను గాంధీ ఆసుపత్రికి         తరలించారు.

బడంగ్‌పేటలో ఇద్దరు బాలురకు..
బడంగ్‌పేట: బడంగ్‌పేట కార్పోరేషన్‌ పరిధిలోని సాయి బాలాజీ కాలనీలో ఇద్దరు బాలురకు కరోనా పాజిటివ్‌ రావడంతో అధికారులు వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.  

మీర్‌పేటలో మహిళకు..
మీర్‌పేట: మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలోని లెనిన్‌నగర్‌కు చెందిన మహిళ ఈ నెల 18న ప్రసవం కోసం  ఇంజాపూర్‌లోని పుట్టింటికి వెళ్లింది. డెలివరీ అనంతరం  పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మీర్‌పేట కమిషనర్‌ సుమన్‌రావు తెలిపారు. దీంతో ఆమె భర్త, అత్తలను హోం క్వారంటైన్‌ చేసినట్లు తెలిపారు.

ఓల్డ్‌ బోయిన్‌పల్లిలో ఒకరికి..
ఓల్డ్‌బోయిన్‌పల్లి: ఓల్డ్‌ బోయిన్‌పల్లి డివిజన్‌ భవానీనగర్‌కు చెందిన  వ్యక్తికి శుక్రవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అనారోగ్యంతో బాధపడుతున్న అతను గత కొన్ని రోజులుగా అసుపత్రుల చుట్టూ తిరిగాడు. రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్న అతను గాంధీలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. అతడి కుటుంబ సభ్యులు ముగ్గురిని హోం క్వారంటైన్‌లో ఉంచారు.  

ఎంఎస్‌మక్తాలో వృద్ధురాలికి..
ఖైరతాబాద్‌: ఖైరతాబాద్‌ డివిజన్, ఎంఎస్‌మక్తాలో ఓ వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఎంఎస్‌మక్తాలో ఉంటున్న వృద్ధురాలు(60) అనారోగ్యంతో బాధపడుతూ సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. దీంతో శుక్రవారం ఆమె కుటుంబసభ్యులను నేచర్‌ క్యూర్‌ హాస్పిటల్‌కు తరలించారు. 

‘గాంధీకుటీర్‌’లో యువకుడికి...
హిమాయత్‌నగర్‌: నారాయణగూడ, గాంధీకుటీర్‌ బస్తీకి చెందిన యువకుడికి శుక్రవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మెదక్‌ జిల్లాకు చెందిన ఇతను మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ నెల 28న ఫీవర్‌ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. అతడికి పాజిటివ్‌ రావడంతో శుక్రవారం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా అతడితో పాటు పని చేస్తున్న మరో ఎనిమిది మంది కోసం అధికారులు గాలింపు చేపట్టారు.

యూసుఫ్‌గూడలో మరో నలుగురికి..
వెంగళరావునగర్‌: యూసుఫ్‌గూడ సర్కిల్‌–19 పరిధిలో శుక్రవారం నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కల్లు కాంపౌండ్‌ గల్లీలో 11 ఏళ్ల చిన్నారి, వీడియోగల్లీలో ఓ కానిస్టేబుల్‌ కరోనా బారిన పడ్డారు. వెంకటగిరిలో ఉంటూ అఫ్జల్‌గంజ్‌ ప్రాంతంలో పని చేస్తున్న మరో కానిస్టేబుల్, ఇంజినీర్స్‌ కాలనీలో నివసిస్తున్న వైద్యుడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు