మాకెందుకు ఈ అన్యాయం ?

7 Dec, 2019 05:24 IST|Sakshi

చిన్నారిపై అత్యాచారం చేసిన మానవ మృగాన్ని ఇంకా మేపుతారా? 

వెంటనే ఎన్‌కౌంటర్‌ చేయాలి: చిన్నారి తల్లి రచన

హన్మకొండ చౌరస్తా : ముక్కు పచ్చలారని 9 నెలల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన మానవ మృగాన్ని ఆరు నెలలుగా జైలులో ఉంచి మేపుతూ తమను క్షోభ పెడుతున్నారని హన్మకొండకు చెందిన చిన్నారి శ్రీహిత తల్లి రచన ఆవేదన వ్యక్తం చేశారు. దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో శుక్రవారం ఆమె హన్మకొండలో విలేకరులతో మాట్లాడారు. తామేం ఏం పాపం చేశామని ప్రభుత్వం అన్యాయం చేస్తుందో అర్థం కావడం లేదని వాపోయారు.

ఒడిలో నిద్రిస్తున్న పాపను ఎత్తుకెళ్లి అత్యంత కిరాతకానికి ఒడిగట్టిన దుర్మార్గుడిని ఉరితీయాలని జిల్లా కోర్టు తీర్పు ఇస్తే.. హైకోర్టు ఈ తీర్పును యావజ్జీవ శిక్షగా మార్చడం తమను బాధించిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన మానవ మృగాన్ని ఎన్‌కౌంటర్‌ చేయాలని.. అప్పుడే తమకు న్యాయం జరుగుతుందని.. పాప ఆత్మకు శాంతి చేకూరుతుందని రచన తెలిపారు.

మరిన్ని వార్తలు