దహెగావ్: మద్యం మత్తులో ఓ కిరాతక తనయుడు కన్నతండ్రినే చంపేశాడు. ఈ దారుణం ఆదిలాబాద్ జిల్లా దహెగావ్ మండలంలోని పెసరికుంటలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. పెసరికుంటకు చెందిన ఇస్తారి అనే వ్యక్తి మద్యం తాగి తండ్రి రామ్టెంకి శంకర్(50) తో గొడవపడ్డాడు. ఆగ్రహంతో తండ్రి నెత్తిపై కర్రతో బలంగా కొట్టాడు. దీంతో రామ్టెంకి శంకర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఇస్తారి తరచుగా తండ్రితో గొడవపడేవాడని, గతంలో కూడా ఒకసారి దాడిచేయగా అదృష్టవశాత్తూ శంకర్ ప్రాణాలతో బయటపడ్డాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.