ఆధార్‌ ఉంటేనే ఎరువు!

5 Dec, 2017 03:25 IST|Sakshi

     వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు 

     ప్రైవేటు ఎరువుల దుకాణాలకు పీవోఎస్‌ల సరఫరా 

     ఎరువుల సబ్సిడీ దుర్వినియోగం కాకుండా ఉండేందుకే..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రైతులు ఇకపై ఎరువులు కొనుగోలు చేయాలంటే ఆధార్‌ కార్డు ఉండాల్సిందే. ఎందుకంటే ఎరువులు కొనుగోలుకు ఆధార్‌కార్డును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆధార్‌ ద్వారా ఎరువులు కొనే పద్ధతిని వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తుంది. రైతులు తమ వెంట ఆధార్‌ తీసుకురాకున్నా.. ఎవరికైనా ఆధార్‌ లేకున్నా అట్లాంటి రైతులకు ఎరువులు అమ్మకూడదని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రాష్ట్రంలోని అన్ని ఎరువుల దుకాణాలకు ఆదేశాలు అందాయి. అలాగే ఆయా దుకాణాలకు పాయింట్‌ ఆఫ్‌ సేల్‌(పీవోఎస్‌) యంత్రాలను కూడా అందజేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 6 వేల పీవోఎస్‌ యంత్రాలను సరఫరా చేయాలని భావించగా.. ఇప్పటికి 5 వేల దుకాణాలకు అందజేశారు. అందులో 3 వేల దుకాణాల్లో పూర్తిస్థాయిలో పీవోఎస్‌ యంత్రాలను బిగించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. కొన్నిచోట్ల పీవోఎస్‌ యంత్రాలు పనిచేయకపోతే వాటిని మార్చి కొత్త వాటిని అందజేస్తున్నారు. 

మున్ముందు డెబిట్‌ కార్డు స్వైప్‌.. 
డీబీటీ విధానంలో రైతు ఎరువుల బస్తా కొనుగోలు చేయాలంటే ప్రస్తుతం ఆధార్‌ కార్డు తీసుకురావాలి. అయితే మున్ముందు డెబిట్‌ కార్డు ద్వారానే లావాదేవీలు జరిపేలా పీవోఎస్‌ యంత్రాలను ఇస్తున్నారు. దాంట్లో ప్రస్తుతం డెబిట్‌ కార్డును ఉపయోగించేలా సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టడంలేదు. రైతులు పూర్తిస్థాయిలో డెబిట్‌ కార్డు లేదా రూపే కార్డు కలిగి ఉన్నట్లు నిర్థారించుకున్నాక పీవోఎస్‌ యంత్రాల్లో సాఫ్ట్‌వేర్‌ను ఆధునీకరిస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఆధార్‌ ద్వారా, మున్ముందు డెబిట్‌ కార్డుతో ఎరువుల విక్రయాలు జరుపుతారు. అలాగే రైతులకు ఒక గుర్తింపు నంబర్‌ కూడా ఇస్తారు. ఈ వివరాలు పీవోఎస్‌ యంత్రాల్లో నిక్షిప్తమై ఎరువుల కొనుగోలు లావాదేవీలు నమోదవుతాయి. లావాదేవీల సమాచారాన్ని కేంద్రానికి సమర్పిస్తే సదరు సబ్సిడీని కంపెనీలకు చెల్లిస్తారు. ఈ విధానంలో సబ్సిడీ చెల్లింపు వ్యవహారం ప్రభుత్వం, కంపెనీల మధ్యనే ఉన్నందున రైతుకు అదనపు ఆర్థిక భారం ఉండబోదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 

సబ్సిడీ పక్కదారి పట్టకూడదనే.. 
యూరియా, డీఏపీ తదితర ఎరువులను కంపెనీలు సబ్సిడీ ధరలకే దుకాణాల్లో రైతులకు అందుబాటులోకి తెస్తుంటాయి. అయితే సబ్సిడీ ఎరువులు రైతులకు కాకుండా మిక్సింగ్‌ ప్లాంట్లు, ఇతర అవసరాలకు మళ్లకుండా ఈ కొత్త విధానాన్ని కేంద్రం అమలులోకి తీసుకువస్తోంది. పీవోఎస్‌ పద్ధతి ద్వారా నేరుగా లబ్ధి చేకూర్చే బదిలీ(డీబీటీ) విధానాన్ని అమలు చేయాలనేది కేంద్రం లక్ష్యం. పీవోఎస్‌లను తీసుకోకపోయినా, ఈ పద్ధతిని అమలు చేయకపోయినా సంబంధిత ఎరువుల దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని సర్కారు స్పష్టంచేసింది. వాస్తవానికి ఈ విధానం ఇప్పటికే అమలు కావాల్సి ఉండగా.. సరిపడా పీవోఎస్‌ యంత్రాలు అందుబాటులో లేక వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు