గ్యాస్‌కు ‘ఆధార్’ అనుసంధానించాలి

5 Sep, 2014 01:46 IST|Sakshi

ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలోని గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ నంబర్ అనుసంధానించేందుకు గ్యాస్ డీలర్లు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ ఆదేశించారు. ఆయన గురువారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో డీఎస్వో గౌరీశంకర్‌తో కలిసి గ్యాస్ డీలర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో 5,20,000 ఎల్‌పీజి కనెక్షన్లు ఉన్నాయన్నారు. వీటిలో 3,29,000 కనెక్షన్లకు (63.3 శాతం) ఆధార్ అనుసంధానం పూర్తయిందన్నారు.

ఇందులో 2,25,000 కనెక్షన్లకు (43.7 శాతం) బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం ఉందన్నారు. కొత్తగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చేప్పుడు, గ్యాస్ రీఫిల్లింగ్ చేసేప్పుడు వినియోగదారుల నుంచి ఆధార్ నంబర్ తీసుకోవాలన్నారు. ఈ నెలాఖరులోగా ఆధార్ నంబర్‌ను గ్యాస్ వినియోగదారులు సంబంధిత డీలర్లకు ఇవ్వకపోతే సదరు కనెక్షన్‌ను బోగస్‌గా పరిగణించనున్నట్టు చెప్పారు. ఆధార్ అనుసంధానం చేయించుకోని వినియోగదారుల జాబితాను అక్టోబర్ 1వ తేదీన ఇవ్వాలని గ్యాస్ డీలర్లను ఆదేశించారు. ఆధార్ కార్డు లేని వారు తమ మండల కేంద్రంలోని మీ సేవ కేంద్రాల్లోగల శాశ్వత ఆధార్ సెంటర్‌లో నమోదు చేయించుకుని, అక్కడ ఇచ్చే ఈఐడీ నంబర్‌ను ఆధార్ సీడింగ్‌లో నమోదు చేయించుకోవాలని చెప్పారు.

 5వ తేదీలోగా సర్వే డేటాతో ‘ఆధార్’ను అనుసంధానించాలి
 సమగ్ర కుటుంబ సర్వే డేటాతో ఆధార్ నంబర్‌ను ఈ నెల 5వ తేదీలోగా అనుసంధానించాలని పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దారులను జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ ఆదేశించారు. ఆయన గురువారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రేషన్ సరుకుల సక్రమ పంపిణీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

జిల్లాలో 24,65,731 రేషన్ కార్డుదారుల కుటుంబాల యూనిట్లు ఉన్నాయన్నారు. వీటిలో 2,57,499 యూనిట్లకు ఇంకా ఆధార్ అనుసంధానించాల్సుందన్నారు. సమగ్ర సర్వే డేటా ఈ నెల 5 తేదీలోగా పూర్తవుతుందన్నారు. ప్రసుత్తం అందుబాటులోగల ఆధార్ నంబర్లను సర్వే డేటాతో అనుసంధానించాలని ఆదేశించారు. రేషన్ కార్డుదారులందరికీ ఆధార్ అనుసంధానించాలన్నారు.

మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేస్తున్న బియ్యాన్ని ఇక నుంచి మండల స్థాయి స్టాక్ పాయింట్ల నుంచి బియ్యాన్ని నేరుగా పాఠశాలలకు చేర్చాలన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన డీటీలు, డీలర్లు, వీఆర్వోలకు నగదు ప్రోత్సాహకం అందిస్తామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి చార్‌‌జ మెమో ఇస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీఎం సాంబశివరావు, డీఈవో రవీంధ్రనాథ్‌రెడ్డి, సివిల్ సప్లై డీడీలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు