ఖాతా ఏ బ్యాంకుదైనా ఆధార్‌ ద్వారా డ్రా

12 Sep, 2019 11:03 IST|Sakshi
మాట్లాడుతున్న యలమందయ్య

పోస్టల్‌ బ్యాంక్‌లో నూతన సౌకర్యం

రూ.10 వేల వరకు నగదును డ్రా చేసుకునే అవకాశం

విలేకరుల సమావేశంలో ఖమ్మం డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ యలమందయ్య

సాక్షి, ఖమ్మం: ఏ బ్యాంక్‌లో ఖాతా ఉన్నా ఆధార్‌కార్డు ఆధారంగా నగదు విత్‌ డ్రా చేసుకునే నూతన సౌకర్యాన్ని పోస్టల్‌ బ్యాంకు కల్పించినట్లు ఖమ్మం డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ ఉసర్తి యలమందయ్య తెలిపారు. బుధవారం స్థానిక పోస్టల్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) ప్రారంభించి ఏడాది పూర్తయిందని, ఈ బ్యాంక్‌ నుంచి గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో అన్ని వర్గాల ప్రజలు పలు రకాల సేవలు పొందుతున్నారని తెలిపారు.

ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ బ్యాంక్‌ సేవలు ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయని, దేశంలో ప్రతి ఒక్కరికీ, ఇంటి నుంచి బ్యాంక్‌ సేవలను అందించే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఐపీపీబీని ప్రారంభించిందన్నారు. బ్యాంక్‌ ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆధార్‌ ద్వారా నగదును విత్‌ డ్రా (ఆధార్‌ అనే బుల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్‌) చేసుకునే అవకాశాన్ని కల్పించిందన్నారు. బ్యాంక్‌ ఖాతా ఉన్న వ్యక్తి ఆ బ్యాంక్‌లో నగదును కలిగి ఉండి బ్యాంక్, ఏటీఎం సౌకర్యాలు లేని ఏ ప్రాంతంలో ఉన్నా మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఉన్నా ఆధార్‌ కార్డ్‌ను చూపించి బయోమెట్రిక్‌ విధానంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న పోస్టాఫీసులోని పోస్టల్‌ బ్యాంక్‌లో నగదును పొందవచ్చని చెప్పారు. ఈ విధానంలో పోస్టల్‌ బ్యాంక్‌ రూ.10 వేల నగదును అందించే సౌకర్యాన్ని కల్పించిందని, ఖాతాదారుడికి ఎలాంటి చార్జీలు కూడా ఉండవని పేర్కొన్నారు. సమావేశంలో ఖమ్మం డివిజన్‌ పోస్టల్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ఎ.అనిల్, ఏరియా మేనేజర్‌ జైల్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు