‘ఆసరా’ అందేలా.. 

10 Jun, 2019 06:44 IST|Sakshi

సాక్షి, కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ఆసరా దరఖాస్తుదారులకు మరో అవకాశం కల్పించింది. పింఛన్‌ దరఖాస్తు గడువు ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. అర్హులు సంబంధిత గ్రామ కార్యదర్శి లేదా ఎంపీడీఓలకు తమ దర ఖాస్తులను అందజేయాలని సూచిం చింది. దీంతో జిల్లా వ్యాప్తంగా మరికొందరు లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉంది.

వయసు కుదింపుతో 25,848 దరఖాస్తులు  
గతంలో ఉన్న 65 ఏళ్ల నిర్ణీత వయసును ప్రభుత్వం 57 ఏళ్లకు కుదించడంతో జిల్లా వ్యాప్తంగా అనేక మంది పింఛన్‌ పొందేందుకు అర్హత సాధించారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే వృద్ధాప్య పెన్షన్‌ వయసు తగ్గిస్తామని ఎన్నికల ప్రచార సమయంలో కేసీఆర్‌ ప్రకటించారు. అంతేకాక.. కుదించిన వయసు వారికి ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచే పెన్షన్‌ అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. దీంతో జిల్లా అధికారులు వివిధ మండలాల నుంచి  57 ఏళ్లు నిండిన వారి వివరాలను ఓటర్‌ జాబితా ఆధారంగా సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే  క్షేత్రస్థాయిలో గ్రామాలలో సర్వే చేసి గ్రామ సభలో వారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ క్రమంలో వరుసగా ఎన్నికలు రావడంతో ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. దీంతో దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో వృద్ధాప్య పింఛన్‌ తీసుకోవడానికి ప్రాథమికంగా అర్హత సాధించిన వారు 25,848 మంది ఉన్నట్లు  తేలింది. దరఖాస్తు గడువు పెంపుతో మరికొందరు పెరిగే అవకాశం ఉంది.
  
పెంచిన పింఛన్‌ జూలై నుంచి..
గత అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్లు రెట్టింపు చేస్తామని ప్రకటించారు. దీనికనుగుణంగా జూన్‌ నుంచి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, చేనేత, బీడీ, గీత కార్మికులు, ఒంటరి మహిళలకు అందే పెన్షన్లు పెరగనున్నాయి. జూలైలో ఈ మొత్తం లబ్ధిదారులకు అందనుంది. జిల్లాలో 1,05,695 ఆసరా లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రస్తుతం రూ.11.19 కోట్లు వస్తుండగా.. జూలై నుంచి ఈ మొత్తం రూ.22.55 కోట్లకు పెరగనుంది. దివ్యాంగుల పింఛన్‌ రూ.1500 నుంచి రూ.3016కు, మిగిలిన వారి పెన్షన్‌ రూ.1000 నుంచి రూ.2016కు పెరిగింది.

జిల్లాకు రూ.11.36 కోట్ల అదనపు లబ్ధి.. 
పెంచిన ఆసరా పింఛన్ల మొత్తాన్ని వచ్చే నెలలో లబ్ధిదారులకు అందించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో వృద్ధాప్య పింఛ¯Œన్‌దారులు 38,907, దివ్యాంగులు 12,499, వితంతువులు 47,478, చేనేత 21, గీత కార్మికులు 146, ఒంటరి మహిళలు 5,656, ఏఆర్‌సీ బాధితులు 843, పైలేరియా బాధితులు 142, బీడీ కార్మికులు ముగ్గురు మొత్తం 1,05,695 మందికి ఆసరా పింఛ¯న్‌లు అందుతున్నాయి. వీరి కోసం ప్రతి నెలా జిల్లాకు రూ.11.19 కోట్ల మొత్తం విడుదలవుతోంది. పెరిగిన మొత్తం ప్రకారం జిల్లాకు  రూ.22.55 కోట్లు కేటాయించనున్నారు.
  
జిల్లాకు రూ.112.48 కోట్లు విడుదల.. 
ప్రభుత్వం ఇటీవల జిల్లాలకు ఆసరా నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలోని ఆసరా లబ్ధిదారులకు ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు చెల్లింపులకు రూ.4361.79 కోట్లు విడుదల చేసింది. ఇందులో జిల్లాకు 112.48 కోట్లు మంజూరయ్యాయి. రెట్టింపు చేసిన ఆసరా పింఛన్లు జూన్‌ నుంచి ఇవ్వనున్న నేపథ్యంలో జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలకు రూ.90.10 కోట్లు విడుదల కాగా, ఏప్రిల్, మే నెలలకు గతంలో లాగే రూ.22.38 కోట్లు చెల్లిస్తారు.

మరిన్ని వార్తలు