ఏప్రిల్లో బల్మూర్ ఎస్ఐ, ఆగస్టులో కానిస్టేబుల్, తాజాగా తెలకపల్లి ఎస్ఐ
ఏడు నెలల వ్యవధిలో 8 మంది ఉద్యోగులపై కేసులు
ప్రభుత్వ కార్యాలయాల్లో పెరిగిపోతున్న అవినీతి
పైకం అడిగిన అధికారులను పట్టిస్తున్న ప్రజలు
ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోదన్నట్లుగా కొంతమంది అధికారులు, ఉద్యోగులు అవినీతికి తెగబడుతున్నారు. పని ఏదైనా పైసలిస్తేనే చేస్తామని తెగేసి చెబుతున్నారు. ప్రజలతో సత్సంబంధాలు అధికంగా ఉండే రెవెన్యూ, పోలీసుశాఖలోనే అవినీతి తిమింగలాలు ఎక్కువగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు కూడా ఈ శాఖలపైనే ఎక్కువగా వస్తుండటంతో ఏసీబీ అధికారులు దృష్టిసారించి పట్టుకుంటున్నారు.
సాక్షి, నాగర్కర్నూల్: సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను, అవినీతి దందాలను అరికట్టాల్సిన పోలీసుశాఖకు కొంతమంది చెడ్డపేరు తెస్తున్నారు. వారి వ్యవహారశైలి కారణంగా మొత్తం పోలీసుశాఖకు మచ్చ తెచ్చిపెడుతోంది. ప్రభుత్వ శాఖల్లో ఉచితంగా ప్రజలకు సేవలు అందాల్సి ఉండగా కొంతమంది అధికారులు, ఉద్యోగులు అక్రమ సంపాదనకు అలవాటుపడి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో ఎంతోకొంత ముట్టజెప్పినా అది సరిపోదన్నట్టుగా అత్యాశకు పోయి ఇంకా ఇవ్వాలని వేధింపులకు గురి చేస్తుండటంతో విసిగిపోతున్న బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఏసీబీ దాడుల్లో 8 మంది అధికారులు పట్టుబడ్డారు. వారిలో పోలీసు, రెవెన్యూశాఖల అధికారులే ఎక్కువగా ఉన్నారు.
ఏడు నెలల్లో 8 ఏసీబీ కేసులు..
పోలీసుశాఖపై దృష్టి
సమాజానికి ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసుశాఖలో అవినీతి పెచ్చుమీరుతుం దన్న విమర్శలు లేకపోలేదు. ప్రతినెలా ఇసుక, మద్యం, ఇతర వ్యాపారుల నుంచి మామూళ్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, అదేవిధంగా పోలీసుస్టేషన్లలో పంచాయతీలు నిర్వహిస్తూ డబ్బులు వసూ లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. స్టేషన్ పరిధిలో ఏ వ్యాపారం జరిగినా తన వాటా ముట్టజెప్పాల్సిందేనన్న తీరుగా కొంతమంది ఎస్ఐలు వ్యవహరిస్తున్నారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. సివిల్ కేసు ల్లోనూ తలదూర్చుతూ తమకు అనుకూలమైన వారికి సెటిల్మెంట్లు చేస్తున్నారని ప్రజలనుంచి బహిరంగంగా విమర్శిలున్నా యి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అటాచ్ చేయడమో, బదిలీ చేయడం, సస్పెండ్ చేయడం వంటి సంఘటన లు నిత్యం జరుగుతూనే ఉన్నా వారిలో మా ర్పు రావడంలేదు. ఈ మధ్య ఫిర్యాదుల సంఖ్య పెరిగిపోవడంతో ఏసీబీ అధికారు లు పోలీసుశాఖపై వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఏడు నెలల్లో ఏసీబీకి పట్టుబడి న 8 కేసుల్లో ఉమ్మడి జిల్లాలో మూడు కేసు లు పోలీసుశాఖకు చెందిన వారిపైనే ఉన్నాయి.