ఏసీబీ పంజా! 

13 Oct, 2018 09:45 IST|Sakshi
తహసీల్దార్‌ కార్యాలయంలోని కంప్యూటర్‌లో వివరాలు పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు రైతు చెన్నారెడ్డి, ఆర్‌ఐ సతీష్‌కుమార్‌రెడ్డి 

ఊట్కూర్‌ (మక్తల్‌): మండల తహసీల్దార్‌ కార్యాలయ చరిత్రలో మొదటిసారిగా ఏసీబీ అధికారులు పంజా విసిరారు. పట్టా మార్పిడికి లంచం డిమాండ్‌ చేసిన ఆర్‌ఐ.. రూ.10 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సంఘటన శుక్రవారం కలకలం రేపింది. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్‌ కథనం ప్రకారం.. మండలంలోని పెద్దజట్రం గ్రామానికి చెందిన కొండారెడ్డి పేరుపై పెద్దజట్రం శివారులో 13 ఎకరాల భూమి ఉంది. ఆయనకు కుమారుడు చెన్నారెడ్డి, కూతురు శ్రీదేవి ఉన్నారు. అయితే కూతురు వివాహ సమయంలో 6 ఎకరాల భూమిని ఆమె పేరుపైన మార్పిడి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయమై భాగ పరిష్కారంలో బాగంగా తన అక్క శ్రీదేవి పేరుపైన 6 ఎకరాల భూమిని పేరు మార్పు చేయాలని కోరుతూ చెన్నారెడ్డి గత రెండు నెలల క్రితం ఆర్‌ఐ సతీష్‌కుమార్‌రెడ్డికి దరఖాస్తు చేశాడు.

 ఆయన పేరు మార్పిడి చేయడానికి కుదరదని, పట్టాదారు బతికి ఉన్నందున సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దానపత్రం కింద రిజిస్ట్రేషన్‌  చేయించుకోవాలని సూచించారు. అయితే చెన్నారెడ్డి మళ్లీ ఆర్‌ఐని కలిసి  సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డబ్బులు అధికంగా అవుతాయని ఇక్కడే పేరు మార్చి ఇవ్వాలని కోరడంతో రూ.10 వేలు లంచం ఇస్తే మారుస్తానని ఒప్పందం కుదిరింది. ఈ విషయమై చెన్నారెడ్డి గత నెల 16 తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించడాడు. వారి ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఉన్న టీకొట్టు దగ్గర చెన్నారెడ్డి ఆర్‌ఐ సతీష్‌కుమార్‌రెడ్డికి రూ.10 వేల నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆర్‌ఐని శనివారం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు పేర్కొన్నారు.

ఆర్‌ఐ ఇంట్లో సోదాలు 
ఊట్కూరులో ఆర్‌ఐని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు మరోవైపు నర్వ మండలం కు మార్‌లింగంపల్లిలోని ఆర్‌ఐ సతీష్‌కుమార్‌రెడ్డి ఇం ట్లోనూ ఏసీబీ సీఐలు వెంకట్, రఘుబాబు ఏకకాల ంలో సోదాలు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ మేర కు ఆర్‌ఐపై ఏసీబీ యాక్ట్‌ 7ఎ, 7బీ సెక్షన్ల కింద కేసు లు నమోదు చేశామని డీఎస్పీ పేర్కొన్నారు. దాడు ల్లో సీఐ లింగస్వామి, కమల్‌కుమార్‌ పాల్గొన్నారు.

మొదటిసారి దాడులు 
ఊట్కూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంపై మొదటి సారి ఏసీబీ దాడులు జరిగినట్లు తహసీల్దార్‌ తిరుపతయ్య తెలిపారు. కిందిస్థాయి అధికారులు డబ్బు లు అడుగుతున్నట్లు ఇప్పటి వరకు తనకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు.  ఏసీబీ దాడులు జరిగా యని తెలియడంతో స్థానికులు అధిక సంఖ్యలో కార్యాలయానికి తరలివచ్చారు. 

లంచం అడిగితే సమాచారమివ్వండి  
ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు వివిధ పనుల నిమిత్తం లంచం అడిగితే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్‌ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాయాల్లో అవినీతిని అరికట్టేందుకు టోల్‌ఫ్రీ నం.1064 ఏర్పాటు చేశామన్నారు. బాధితులు సెల్‌ నం.94913 05609కు గాని లేకపోతే మహబూబ్‌నగర్‌లోని ఏసీబీ  కార్యాలయంలో గాని నేరుగా సంప్రదించవచ్చన్నారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

మరిన్ని వార్తలు