స్కూళ్లకూ అక్రెడిటేషన్‌!

3 Feb, 2020 02:50 IST|Sakshi

న్యాక్‌ తరహాలోనే రాష్ట్ర స్థాయిలో  స్టేట్‌ స్కూల్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ

కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

నాణ్యతాప్రమాణాల  పెంపే లక్ష్యం..

ఎస్‌ఎస్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు అక్రెడిటేషన్‌..

కొత్త స్కూళ్లు ఏర్పాటుచేయాలంటే ఎస్‌ఎస్‌ఎస్‌ఏ  నుంచే లైసెన్స్‌..

సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలోనే కాదు.. పాఠశాల విద్యలోనూ అక్రెడిటేషన్‌ విధానం రాబోతోంది. నాణ్యతా ప్రమాణాలు పాటించే కాలేజీలకు నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడి టేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) ఇచ్చే గుర్తింపు తరహాలోనే పాఠ శాలల్లో నాణ్యతా ప్రమాణాల పెంపునకు అక్రెడిటేషన్‌ విధా నం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం జాతీయ స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలోనే స్వతంత్ర అక్రెడిటేషన్‌ సంస్థను ఏర్పాటు చేయా లని భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరంలో అమల్లోకి తీసుకురాబోతున్న నూతన విద్యా విధానంలో ఈ అంశాన్ని పొందుపరిచింది. స్టేట్‌ స్కూల్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ (ఎస్‌ఎస్‌ఎస్‌ఏ) పేరుతో దీనిని ఏర్పాటు చేయాలని నూతన విద్యా విధానంపై ఏర్పాటైన కస్తూరి రంగన్‌ కమిటీ ప్రతిపాదించింది. అంతేకాదు.. కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నా ఎస్‌ఎస్‌ఎస్‌ఏ నుంచే లైసెన్స్‌ ఇచ్చే విధానం తేవాలని స్పష్టం చేసింది.

నాణ్యమైన విద్య కోసం..: ప్రస్తుతం పాఠశాలల నిర్వహణ, ప్రమాణాల పెంపు కార్యక్రమాలన్నీ పాఠశాల విద్యాశాఖ (జిల్లాల్లో డీఈవోలు) నేతృత్వంలోనే కొనసాగు తుండటంతో అధికారం కేంద్రీకృతమైంది. అయితే దాని వల్ల పాఠశాలల నిర్వహణ విధానం దెబ్బతింటోం దని, ఫలితంగా నాణ్యమైన విద్యను అందించడం సాధ్యం కావడం లేదని నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ) ఫైనల్‌ కాపీలో కస్తూరి రంగన్‌ కమిటీ పేర్కొంది. పైగా చాలా ప్రైవేటు యాజమాన్యాలు విద్యను ఆర్థిక వనరుగానే చూస్తూ వ్యాపారంగా మార్చేశాయని వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో విద్యా సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు పారదర్శక విధానాన్ని తీసుకురావాల్సిన అవసరముందని తెలిపింది. అందుకే పాఠశాల విద్యా విధానంలో బాధ్య తను పెంపొందించే చర్యలు చేపట్టాలని సూచించింది.

పాఠశాలవిద్యలో 4 కీలకం
పాఠశాల విద్య పరిపాలన, నిర్వహ ణలో 4 అంశాలే కీలకమని నూతన విద్యా విధానంపై ఏర్పాటైన కస్తూరిరంగన్‌ కమిటీ పేర్కొంది. అందులో పాలసీ మేకింగ్, ప్రొవిజన్‌/ ఆపరేషన్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్, వృత్తి నైపుణ్యాల పెంపుతో పాటు ప్రమాణాల పెంపు, స్వయం ప్రతిపత్తిగల సంస్థతో అకడమిక్‌ వ్యవహరాల నిర్వహణ చేప ట్టాలని, ఇందుకు అధికార వికేంద్రీకరణ చేపట్టాలని వెల్లడించింది.

విద్యా ప్రమాణాల పెంపునకు పాలసీ రూప కల్పన వ్యవహారాలను అత్యున్నత విభాగంగా పాఠశాల విద్యాశాఖే పర్యవేక్షించాలి.

పాఠశాలల్లో విధానాలు, పథకాల అమలును పాఠశాల విద్యా డైరెక్టరేట్‌ చూడాలి.

పాఠశాలలు కనీస నాణ్యతా ప్రమాణాలు సాధించేందుకు రాష్ట్రాలు వృత్తిపరమైన నాణ్యతా ప్రమాణాల పెంపునకు ఎస్‌ఎస్‌ఎస్‌ఏ పేరిట స్వయం ప్రతిపత్తిగలసంస్థలు ఏర్పాటు చేయాలి. పాఠశాలలు, టీచర్లు, భాగస్వాములతో సంప్ర దించి వాటి విధివిధానాలను రాష్ట్రాల రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండళ్లు రూపొందిం చాలి.  ఎస్‌ఎస్‌ఎస్‌ఏ పాఠశాలల సెల్ఫ్‌ ఆడిట్‌ను పరిశీలించి అక్రెడిటేషన్‌ ఇచ్చేందుకు అవసరమైన ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేయాలి.

ఎస్‌ఎస్‌ఎస్‌ఏ అమలు చేసే విధివిధానాలు అన్నింటినీ పారదర్శకంగా రూపొందించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంచాలి.

అన్ని స్థాయిల విద్యలో అక్రెడిటేషన్‌ ఉండాలి. దీనిని ప్రీస్కూల్, ప్రైవేటు, ప్రభుత్వ విద్య విభాగాలన్నిటిలో అమలు చేయాలి. తద్వారా కచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు సాధించాలి.

కొత్త ప్రైవేటు స్కూళ్ల ఏర్పాటుకు ఎస్‌ఎస్‌ఎస్‌ఏ నుంచి లైసెన్స్‌ టు స్టార్ట్‌ ఏ స్కూల్‌ (ఎల్‌ఎస్‌ఎస్‌) పొందాలి. ఎస్‌ఎస్‌ఎస్‌ఏ నిబంధనల మేరకు పారదర్శకతతో కూడిన సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలి.

అకడమిక్‌ వ్యవహారాలు, కరిక్యులమ్‌ సంబంధ అంశాలు అన్నింటినీ జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండళ్ల సహకారంతో రాష్ట్ర విద్యా పరిశో ధన, శిక్షణ మండళ్లు(ఎస్‌సీఈఆర్‌టీ) చూడాలి. టీచర్‌ శిక్షణ సంస్థలను బలోపేతం చేసి విధానాల రూపకల్పనలో వాటి సహకారం తీసుకోవాలి.

స్కూల్‌ క్వాలిటీ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడి టేషన్‌ ఫ్రేమ్‌ వర్క్‌ను (ఎస్‌క్యూఏఏఎఫ్‌) ఎస్‌సీఈ ఆర్‌టీలు రూపొందించాలి. దీని రూపకల్పనలో సంబంధిత వర్గాలను భాగస్వాములు చేయాలి.

ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఒకే రకమైన అసెస్‌మెంట్, అక్రెడిటేషన్‌ విధానం అమలు చేయాలి. దానికి సంబంధించిన విధివిధానాలను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఇవ్వాలి.

నాణ్యతా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొనే క్రమంలో నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (ఎన్‌ఏఎస్‌), స్టేట్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (సాస్‌) అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

కేంద్ర విద్యా సంస్థల అక్రెడిటేషన్‌కు సీబీ ఎసీఈ, ఎన్‌సీఈఆర్‌టీలతో సంప్రదించి ఎంహెచ్‌ ఆర్డీ రెగ్యులేటరీ విధానాన్ని రూపొందించాలి.

అక్రెడిటేషన్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు విద్యాహక్కు చట్టం–2009ని సమీక్షించాలి. అయితే మూడేళ్ల వయసు నుంచి అందించే ఎర్లీ చైల్డ్‌హుడ్‌ ఎడ్యుకేషన్‌ నుంచి మొదలుకొని 12వ తరగతి వరకు విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం అందరికీ విద్యావకాశాలు దూరం కాకుండా చూడాలి. అనాథ బాలలు, విధి వంచితులకు నష్టం వాటిల్లకుండా చూడాలి. గత దశాబ్ద కాలపు అనుభవాలను పరిగణనలోకి తీసుకొని అక్రెడిటేషన్‌ విధానం రూపొందించాలి.

ఏటా విద్యా ప్రమాణాలు పరిశీలించే ఎన్‌ఏఎస్‌ నిర్వహణకు నేషనల్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌ ఫర్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ను ఏర్పాటు చేయాలి.    

మరిన్ని వార్తలు