నిధులు దుర్వినియోగం చేస్తే చర్యలు

17 Oct, 2017 16:07 IST|Sakshi

బోధన్‌రూరల్‌(బోధన్‌): ప్రభుత్వ పథకాల అమలు, గ్రామీణ ప్రజలకు ఉపాధిహామీ కల్పనలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం, నిర్లక్ష్యానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం బోధన్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో 10వ విడత మండలస్థాయి ఈజీఎస్‌ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ తనిఖీలో మండలం లోని 32 జీపీల పరిధిలో ఉపాధిహామీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు, రికార్డుల నమోదు, నిధుల వినియోగం వంటి అంశాలపై డీఆర్‌డీవో ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.

2016 సెప్టెంబర్‌ 1 నుంచి 2017 జూన్‌ 30 వరకు మండలంలో మొత్తం రూ. 12కోట్లకు పైగా ప్రభుత్వ నిధులు వినియోగించారని, అయితే ఇందులో సుమారు రూ. 3లక్షల వరకు నిధులు దుర్వినియోగం జరిగినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ నిధులను ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు, సీనియర్‌ అసిస్టెంట్‌లు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ల నుంచి రికవరీ చేపట్టామని వారు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం గా వ్యవరించిన 70మంది మేట్లను తొలగించామని డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఎంపీడీవో మల్లారెడ్డి, ఈవోపీఆర్‌డీ రాజేశ్వర్, ఈజీఎస్‌ ఏపీఓ రాజేశ్వర్, సోషల్‌ ఆడిట్‌ అధికారి చంద్రశేఖర్, ఎస్‌ఆర్పీపీలు రాము, రవి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు