సేవ్‌ నల్లమల

16 Sep, 2019 10:12 IST|Sakshi

సామాజిక మాద్యమాల్లో గళం విప్పిన సెలబ్రిటీలు 

సోషల్‌ మీడియాలో సేవ్‌ నల్లమల నినాదం 

సాక్షి, నాగర్‌కర్నూల్‌: కొన్నిరోజులుగా సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరి నోటా ‘సేవ్‌ నల్లమల’ అనే మాటే వినపడుతోంది. సోషల్‌మీడియాలో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్‌. దేశంలో తరగని సంపద ఉందని.. దానికంటే ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని అందరూ కోరుతున్నారు.. ఇదే విషయమై ఆదివారం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ అసెంబ్లీలో తవ్వకాలకు అనుమతి ఇవ్వబోమని నల్లమల ప్రజలకు భరోసా ఇచ్చే మాటిచ్చారు. ఆందోళన  సినీ రంగాన్ని కూడా కదిలించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జనసేన అధినేత, సినీ హీరో ప్రవన్‌ కళ్యాణ్, దేవరకొండ విజయ్, యాంకర్లు, డైరెక్టర్లు యురేనియానికి వ్యతిరేకంగా మద్దతు తెలిపారు. భావితరాలకి, బంగారు తెలంగాణ ఇస్తారా.? యురేనియం కాలుష్య తెలంగాణ ఇద్దమా? అని ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు ఆలోచించాలని పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు.

యురేనియం కొనొచ్చు.. కానీ అడవిని కొనగలమా? యురేనియం కోసం నల్లమలను నాశనం చేస్తారా అని సినీనటుడు విజయ్‌ దేవరకొండ ట్విట్‌ చేస్తూ ఉద్యమానికి మద్దతు తెలిపారు. వీరిదారిలోనే రాహుల్‌ రామకృష్ణ, దర్శకుడు శేఖర్‌ కమ్ముల, సురేంధర్‌రెడ్డి, నాగ్‌ ఆశ్విన్, ఆడివి శేష్, నటి సుమంత, రామ్, వరుణ్‌తేజ్, సాయితేజ్, అనసూయ, వివి వినాయక్‌ యురేనియానికి వ్యతిరేకంగా ట్విట్‌ చేస్తూ సేవ్‌ నల్లమల ఉద్యమానికి మద్దతు తెలిపారు. నల్లమలలో యురేనియం త్వవకాలకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు నినాదాలు చేసి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు.  

ప్రభుత్వంలో కదలిక.. సీఎం ప్రకటనతో ఊరట  
సేవ్‌ నల్లమల ఉద్యమం ప్రభుత్వాన్ని కదిలించింది. దీనిపై రెండు రోజుల క్రితం కేటీఆర్‌ సీఎం దృష్టికి తీసికెళతామని, ప్రజల ఉద్యమాన్ని పరిగణంలోకి తీసుకుంటామని చెప్పిన విధంగానే ఆదివారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ యురేనియం తవ్వకాలను అనుమంతిచబోమని ప్రకటించారు. యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం ఎవరికి అనుమతులు ఇవ్వలేదని, ఇచ్చే ఆలోచన కూడా లేదని, భవిష్యత్‌లో కూడా ఇవ్వబోమన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

గతంలో 2009లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిందని, కడపలో తవ్వుతున్నారని, రైతాంగానికి అన్నం పెట్టే ప్రధానమైన కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జుసాగర్‌ ప్రాజెక్టులు కలుషితమై నాశనం అయ్యే పరిస్థితి ఉందని, హైదరాబాద్‌ కూడా దెబ్బతినే పరిస్థితి ఉండటం చేత ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వమని, ఇదీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణ యమని స్పష్టం చేశారు. కేంద్రం గట్టిగా పట్టుపడితే అందరం కలిసి కొట్లాడుద్దామని సీఎం ప్రకటించారు.

అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుఫున యురేనియం పరిశోధన, తవ్వకాలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, భవిష్యత్‌లో ఇవ్వ బోదని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ శాసన మం డలిæలో స్పష్టం చేశారు. దీనిని సంతృప్తి చెందని ఈ ప్రాంత ఉద్యమకారు లు సీఎం ప్రకటనను స్వాగితిస్తూనే మన పోరాటంతో అప్రమత్తంగా ఉండాలని, ప్ర మాదం ఏరూపంలోనైనా ముంచుక రా వచ్చని ప్రకటించింది. సీఎం ప్రకటన వల్ల ఉద్యమం నిలిచిపోతుందా! యథావిధిగా కొనసాగిస్తారనే దానిపై స్పష్టత రాలేదు.

మేమెప్పుడూ ప్రజాపక్షం.. నల్లమల సురక్షితం 
తాను ముందు నుంచి చెబుతూనే ఉన్నా.. యురేనియం తవ్వకాలు జరిగితే ప్రజల పక్షాన తానే ముందుండి పోరాడతానని. ప్రతి పక్షాల కుట్రలను సీఎం కేసీఆర్‌ పటాపంచలు చేశారు. యురేనియం నిక్షేపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు  ఇవ్వలేదు. భవిష్యత్‌లో కూడా ఇవ్వబోమని సీఎం తేల్చి చెప్పారు. ఇదీ ప్రకృతి పట్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంకు ఉన్న నిబద్దత. నల్లమల సురక్షితంగా ఉంటుంది. తాను సంతకాలు పెట్టారని కాంగ్రెస్‌ నాయకులు గగ్గోలు పెట్టి ప్రజల్లో భయాందోళనలు సృష్టించారు.  
– గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే అచ్చంపేట  

మరిన్ని వార్తలు