ఫోన్‌ లాక్‌ ఓపెన్‌ అయితేనే గుట్టు వీడేది! 

8 Feb, 2019 00:03 IST|Sakshi

బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసు విచారణ వేగవంతం  

హైదరాబాద్‌: బుల్లితెర నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో కీలక ఆధారాలుగా భావిస్తున్న ఝాన్సీ 2 మొబైల్‌ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక ఫోన్‌ లాక్‌ ఓపెన్‌ కాగా అందులో ఉన్న మెసేజ్‌ల్లో కొన్ని ఆమె ప్రియుడు సూర్య తేజకు పంపి తిరిగి డిలీట్‌ చేసినట్లు గుర్తించారు. డిలీట్‌ చేసిన మెసేజ్‌లను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు పంజగుట్ట పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మరో ఐ ఫోన్‌ లాక్‌ ఎంత ప్రయత్నించినా తెరుచుకోవడంలేదని పోలీసులు గురువారం తెలిపారు. కాగా లాక్‌ ఓపెన్‌ అయిన ఫోన్‌లో పెద్దగా సమాచారం లేదు. ఝాన్సీ అన్న దుర్గాప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదులో సూర్య వేధింపుల వల్లే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని ఉండగా పోలీసులకు సరైన ఆధారాలు లభించలేదు. దీంతో ఇప్పటివరకు సూర్యపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఐఫోన్‌ లాక్‌ తెరిస్తే ఎన్నో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కాగా గత నెలలో కూడా ఝాన్సీ ఓ సారి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించినట్లు తెలిసింది.
 

>
మరిన్ని వార్తలు