పైప్‌లైన్‌ ద్వారానే అదనపు టీఎంసీ 

2 May, 2019 02:40 IST|Sakshi

కాళేశ్వరంలో మూడో టీఎంసీ నీటి తరలింపునకు పైప్‌లైన్‌ వ్యవస్థ 

ఇంజనీర్లకు సూచించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌... పాత జీవోలు రద్దు... 

సాక్షి, హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టులో మూడో టీఎంసీ నీటి తరలింపునకు గాను ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సొరంగ మార్గాల ద్వారా కాకుండా పూర్తిగా పైప్‌లైన్‌ వ్యవస్థ ద్వారానే నీటిని తరలించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పైప్‌లైన్‌ వ్యవస్థకు అయ్యే వ్యయ అంచనాలతో మళ్లీ పరిపాలనా అనుమతులు మంజూరు చేసి పనులు మొదలు పెట్టాలని సూచించారు.  

తక్కువ సమయం..అధిక వ్యయం.. 
కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భాగంగా ప్రస్తుతం రెండు టీఎంసీల నీటిని తరలించేలా పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నీటితో ప్రాజెక్టు కింద నిర్ణ యించిన సాగు అవసరాలు తీరే అవకాశం లేకపోవడంతో అదనంగా మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసే లా సీఎం కేసీఆర్‌ నిర్ణయించి, అందుకు అనుగుణం గా ప్రణాళిక వేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఇందుకు గాను ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో అదనపు మోటార్ల ఏర్పాటు పనులు మొదలయ్యాయి. ఎల్లంపల్లి దిగువన మిడ్‌మానేరు వరకు కొత్తగా అప్రోచ్‌ఛానల్, గ్రావిటీ కాల్వ ద్వారా రూ. 10,500కోట్లతో నీటిని తరలించే ప్రత్యామ్నాయం సిద్ధమైంది. ఇక మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్‌ వరకు ఒక టీఎంసీ నీటిని గ్రావిటీ కాల్వలు, సొరంగాల ద్వారా తరలించాలని నిర్ణయించారు. మొత్తం గా 11 కి.మీల మేర గ్రావిటీ కాల్వ, మరో 24 కి.మీ. ల సొరంగాలు తవ్వాల్సి ఉంటుందని, 3 పంప్‌హౌస్‌ ల నిర్మాణం చేయాల్సి ఉంటుందని లెక్కగట్టారు. వీటికోసం రూ.12,594 కోట్లు అంచనా వేశారు. దీనికి సంబంధించి జీవోలు సైతం ఇచ్చారు. వాటిని ఎన్నికల కోడ్‌ దృష్ట్యా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెట్ట లేదు. మంగళవారం సమీక్షలో దీనిపై చర్చించారు.

సొరంగాల నిర్మాణానికి భూసేకరణ అవసరమని, ఇప్పటికే మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ పరిధిలో సేకరణ సమస్యను అధిగమించలేక, కోర్టు ల చుట్టూ తిరగాల్సి వస్తోందన్న అభిప్రాయం ప్రభు త్వ పెద్దల నుంచి వ్యక్తమయింది. దీనికి తోడు సొరంగాల నిర్మా ణానికి రెండేళ్లకు మించి సమయం పట్టే అవకాశాల దృష్ట్యా, దాన్ని పక్కన పెట్టాలని సీఎం సూచించారు. పైప్‌లైన్‌ ద్వారా అయితే భూసేకరణ అవసరాలు తగ్గుతాయని, నిర్మాణాన్ని సైతం ఏడాది నుంచి ఏడాదిన్నరలో పూర్తి చేసే అవకాశం ఉంటుందని అన్నట్లుగా అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ నిర్మా ణాలకు అదనంగా సొరంగాల నిర్మాణానికి అయ్యే ఖర్చుకన్నా అదనంగా రూ. 1,400 కోట్ల నుంచి రూ.1,600 కోట్లు అవుతుందని అంచనా. అంటే పైప్‌లైన్‌ వ్యవస్థ నిర్మాణ వ్యయం రూ.14 వేల కోట్లను దాటే అవకాశం ఉంది. దీనిపై  ప్రణాళిక సిద్ధం చేశాక కొత్త అంచనాలతో అనుమతులు ఇవ్వనున్నారు.

మరిన్ని వార్తలు