‘ముడుపులకు’  తప్పని భారీ మూల్యం

11 Jun, 2019 17:29 IST|Sakshi
సస్పెన్షన్‌కు గురైన డీఎస్పీ కె.నర్సింహారెడ్డి, ఎస్సై తోట తిరుపతి

పోలీసుశాఖలో అక్రమాల తంతు 

లక్షల్లో మామూళ్లు, సాఫీగా అక్రమ దందాలు 

నిందితుల అడుగులకు మడుగులు 

డీఎస్పీ, ఎస్సై సస్పెన్షన్‌తో ఖాకీల్లో కలవరం 

సాక్షి, ఆదిలాబాద్‌: గుట్కా.. మట్కా.. అక్రమ దం దాల్లో మామూళ్లకు రుచిమరిగారు.. కేసుల్లో బాధితుల పక్షాన కాకుండా నిందితులకు కొమ్ముకాస్తూ వసూళ్లకు తెగబడ్డారు. స్టేషన్‌ మెయింటనెన్స్‌ కోసం వచ్చే నిధుల్లోంచి కమీషన్‌ కక్కుర్తి.. ఇదీ పో లీసు ఆఫీసర్ల దురాశ.. ఆదిలాబాద్‌ డీఎస్పీ కె.నర్సింహారెడ్డి, జైనథ్‌ ఎస్సై తోట తిరుపతి సస్పెన్షన్‌ వ్యవహారం పోలీసు శాఖలో కలవరానికి దారి తీసింది. ఓ హోదాలో ఉన్న పోలీసు అధికారుల వసూళ్లకు అడ్డుఅదుపు లేకపోవడంతో కింది పో లీసుల్లో నైతికత కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌ ఆది నుంచి అక్రమ వసూళ్లపై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కొంతమంది పోలీసు అధికా రుల కారణంగా ఆ శాఖకు మచ్చ వస్తోంది.

డీజీపీకి ఫిర్యాదుతోనే..

ఫోర్‌స్క్వేర్‌ టెక్నో మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ పేరిట నిరుద్యోగులకు డిజిటల్‌ ఇండియా పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని కొంతమంది నమ్మబలికారు. నిజామాబాద్‌ జిల్లా కు చెందిన నగరం కల్యాణ్‌కుమార్‌ చైర్మన్‌గా, స య్యద్‌ సాహెర్‌ పాషా మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న ఈ కంపెనీకి జిల్లాల్లో ఏజెంట్లను నియమించుకుని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని సెమినార్‌ నిర్వహించి వసూళ్లు చేస్తూ వచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు సంబంధించి 596 మంది నుంచి రూ.50వేల నుంచి మొదలుకొని రూ.2లక్షల చొప్పున మొత్తంగా సుమారు రూ. 3.57 కో ట్లు ఏజెంట్ల ద్వారా వసూళ్లు చేశారు.

దీని పై 2018 ఏప్రిల్‌ 11న ఆదిలాబాద్‌ రూరల్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అప్పట్లో ఆదిలాబాద్‌ రూరల్‌ ఎస్సైగా తోట తిరుపతి వ్యవహరిం చారు. ఈ కేసులో పోలీసులు సూత్రధారులను విడిచి స్థానికంగా ఉన్న ఏజెంట్లను అరెస్టు చేశారని తెలుస్తోంది. దీంతో వీరు డీజీపీ మహేందర్‌ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. డీజీపీ ఆదేశాల మేరకు ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు.

 ఇచ్చోడ సీఐ విచారణ..

ఎస్పీ ఆదేశాల మేరకు ఇచ్చోడ సీఐ శ్రీనివాస్‌ ఈ కేసు విచారణను రెండు నెలల కింద చేపట్టినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌ వనస్తలిపురంలో ఉన్న ఫోర్‌స్క్వేర్‌ టెక్నో మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మెయిన్‌ బ్రాంచ్‌లో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో వారు రాష్ట్రంలోని నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని వసూళ్లు చేసినట్లు తేలింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల్లోనూ వీరి కార్యకలాపాలు విస్తరించి ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పలువురు ఫిర్యాదు చేయడంతో కేసులో చైర్మన్‌ నగరం కల్యాణ్‌కుమార్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సయ్యద్‌ సాహెర్‌ పాషా, ఆదిలాబాద్‌ ఏజెంట్‌ సయ్యద్‌ హైమద్‌లతో పాటు మరికొంత మందిని పోలీసులు అరెస్టు చేయడం సంచలనం కలిగిస్తుంది. 

ఈ కేసులో ప్రధాన నిందితులను అరెస్టు చేయకుండా పోలీసులు లక్షల్లో మామూళ్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది. రూ.12 లక్షల నుంచి రూ.20లక్షల వరకు వసూళ్లు చేసినట్లు సమాచారం. దీంతోనే యేడాది కిందట నమోదైన కేసులో ప్రధాన సూత్రధారులను అరెస్టు చేయకుండా కేసును పక్కదారి పట్టించడంలో మామూళ్లు వసూలు చేసిన పోలీసు అధికారులు కీలకంగా వ్యవహరించారన్న అపవాదు మూ టగట్టుకున్నారు. ఈ వ్యవహారం డీజీపీ వరకు వెళ్లడం, డీజీపీ ఆదేశాల మేరకు ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించడంతో అక్రమార్కుల వ్యవహారం బయట పడింది. ఈ సంఘటన పోలీసు శాఖలో జరుగుతున్న మామూళ్ల వ్యవహారాలకు అద్దం పడుతుంది. అడ్డు, అదుపు లేకుండా సాగుతున్న అక్రమ దందాలకు పోలీ సు అధికారులే వెన్ను కాస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. గతంలో జిల్లాలో పెద్ద ఎత్తున పట ్టబడిన గుట్కా, కలప స్మగ్లింగ్‌ వ్యవహారాలు సంచలనం కలిగించాయి. అందులోనూ పోలీసు అధికారుల పాత్రపై విమర్శలు వ్యక్తమైనా అవి చడిసప్పుడు కాకుండా మూతపడ్డాయి.

రికవరీ చేస్తున్నాం

ఫోర్‌స్క్వేర్‌ టెక్నో మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రధాన సూత్రధారులను అరెస్టు చేయడం జరిగింది. నిరుద్యోగుల నుంచి వారు వసూలు చేసిన డబ్బులను రికవరీ చేస్తున్నాం. నిరుద్యోగ బాధితులకు న్యాయం చేస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉమ్మడి పలు జిల్లాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయి. 
– జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌ 

మరిన్ని వార్తలు