‘ఏఎల్‌పీ’లో విష వాయువు!

6 Jul, 2020 08:07 IST|Sakshi

రెండు నెలలుగా మూసివేసిన ప్యానెల్‌

ఈనెల 2న మళ్లీ ఓపెన్‌ 

అయినా అదుపులోకి రాని విషవాయువు

రూ. 140 కోట్లు విలువ చేసే చాక్స్‌ను వెలికితీసే పనిలో అధికారులు

సింగరేణికే ప్రతిష్టాత్మకంగా నిలిచిన అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టులో మూడోప్యానెల్‌ ఏర్పాటుకు బాలారిష్టాలు ఎదురవుతున్నాయి. గనిలో బొగ్గు నిల్వలు పూర్తయిన రెండో ప్యానెల్‌లో విషవాయువుల తీవ్రత అదుపులోకి రాలేదు. ప్యానెల్‌లో బొగ్గుకు మంటలంటుకోవడంతో కార్బన్‌మోనాక్సైడ్‌(సీఓ) విషవాయువులు పెరిగిపోయాయి. మే 4న రెస్క్యూ సిబ్బంది సహాయంతో ప్యానెల్‌కు గోడలు కట్టి మూసివేశారు. అదే ప్యానెల్‌లో ఉన్న బొగ్గుకు ఆక్సిజన్‌ తగలకుండా ప్యానెల్‌కు సమాంతరంగా బోర్‌వెల్స్‌వేసి సీఓటూ, నైట్రోజన్‌ పంపించారు. ఈ క్రమంలో ఈనెల 2న ప్యానెల్‌ను తిరిగి ఓపెన్‌ చేశారు.

గోదావరిఖని(రామగుండం): రెండు నెలల అనంతరం గనిలోని రెండో ప్యానెల్‌ను రెస్క్యూ సిబ్బంది సాయంతో ఈనెల 2న తెరిచారు. మొదటి రెండు రోజుల్లో ప్యానెల్‌లో విషయవావుల ప్రభావం కన్పించలేదు. మూడో రోజు ఆదివారం నుంచి విషయవావులు పెరగడంతో బొగ్గు చల్లారనట్లుగా భావిస్తున్నారు. ఈక్రమంలో మండుతున్న బొగ్గు పొరలపై నీటిని చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు.

రూ. 145కోట్ల విలువైన చాక్స్‌ 
సింగరేణి సంస్థ రామగుండం రీజియన్‌లో అడ్య్రాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టులో రెండు ప్యానెళ్లలో బొగ్గును విజయవంతంగా వెలికితీశారు. మూడో ప్యానెల్‌ ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్న క్రమంలో రెండో ప్యానెల్‌లో ఉన్న యంత్రాలను మూడో ప్యానెల్‌లోకి తరలించేందుకు నిర్ణయించారు. ఈక్రమంలో లాంగ్‌వాల్‌ యంత్రానికి సంబంధించి మిగితా భాగాలు తరలించారు. హైడ్రాలిక్‌ చాక్స్‌ మాత్రం అందులోనే ఉండిపోయాయి. అందులో ఉన్న విషవాయులను అరికట్టేందుకు మే 4న ప్యానెల్‌కు గోడ పెట్టి మూసివేశారు. దీంతో రూ.145కోట్ల విలువచేసే 145హైడ్రాలిక్‌ చాక్స్‌ అందులోనే ఉండిపోయింది. విషవాయుల తీవ్రత పూర్తిగా తగ్గిన తర్వాత తిరిగి ప్రాపర్టీని వెలికితీయాలనే ఆలోచనతో యాజమాన్యం వేచి చూసింది. ఈనెల 2న రెస్క్యూ సిబ్బంది సాయంతో మూసివేసిన గోడలను తిరిగి ఓపెన్‌ చేశారు. 

ప్యానెల్‌లో మళ్లీ మొదలైన మంటలు..
అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టులో మూసివేసిన రెండో ప్యానెల్‌ను ఈనెల 2న రెస్క్యూ సిబ్బంది సాయంతో తెరిచారు. మొదటి రెండు రోజులు బాగానే ఉన్నప్పటికి మూడో రోజునుంచి అందులోంచి మళ్లీ వేడి రావడంతో పాటు విషయవాయువుల తీవ్రతను గుర్తించారు. దీంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. అందులో ఉన్న చాక్స్‌ను తొలగిస్తూ మంటలను అరికట్టే పనిలో నిమగ్నమైయ్యారు. అయితే తొందరపడి ప్యానెల్‌ గోడలు తొలగించారని దీంతో పాత పరిస్థితి పునరావృతం అయ్యిందని నిపుణులు అంటున్నారు. మరికొన్ని రోజులు ప్యానెల్‌ మూసివేసి ఉంటే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఫైర్‌ కంట్రోల్‌ చేస్తూ చాక్స్‌ వెలికితీస్తాం: అధికారులు 
మూసివేసిన ప్యానెల్‌ తెరిచిన మాట వాస్తవమేనని, అందులో 145 హైడ్రాలిక్‌ చాక్స్‌ ఉన్నాయని, ప్యానెల్‌లో ఉన్న వేడిని తగ్గిస్తూ చాక్స్‌ను బయటకు తీసే ప్రయత్నంలో ఉన్నామని అధికారులు తెలిపారు. గనిలోని ప్యానెల్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామన్నారు. ఒకవైపు మంటల తీవ్రతను తగ్గిసూ్తనే రోజుకు నాలుగుచొప్పున హైడ్రాలిక్‌ చాక్స్‌కు బయటకు తీస్తామని తెలిపారు. మరీ అదుపులోకి రాకుంటే తిరిగి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన అధికారులు రెస్క్యూ, వైద్య సిబ్బంది గనిపై నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని వెల్లడించారు.

మరిన్ని వార్తలు