జూరాలతో రైతాంగానికి మేలు

7 Oct, 2014 23:52 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూగర్భజలాలపై ఆధారపడిన జిల్లా రైతాంగానికి ‘పాలమూరు-రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల’ పథకంతో మేలు చేకూరనుందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పది లక్షల ఎకరాలను స్థిరీకరించే ఈ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వ హయాంలోనే అంకురార్పణ జరిగిందని, సమగ్ర సర్వే కూడా పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే జిల్లాలోని 18 మండలాలకు సాగు, తాగు నీరు అందుతుందని స్పష్టం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో టీఆర్‌ఆర్ మాట్లాడారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు సర్వే పనులకు గత ప్రభుత్వం రూ.6.91 కోట్లు కేటాయించిందని, వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని కేసీఆర్ సర్కారు ప్రకటించడం జిల్లా రైతాంగానికి శుభపరిణామం అని అన్నారు.

గండేడ్‌లో నిర్మించే 45టీఎంసీల జలాల సామర్థ్యం గల రిజర్వాయర్‌ను ప్రతిపాదిస్తున్నారని, తద్వారా పరిగి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. బీడువారిన పొలాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్ధేశంతో దివంగత నేత వైఎస్ రాజ శేఖరరెడ్డి జూరాల-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించాలనే యోచన చేశారని, అందులో భాగంగానే కిరణ్ సర్కారు ప్రాజెక్టు ప్రాథమిక సర్వేకు నిధులు విడుదల చేసిందని తెలిపారు. దాదాపు రూ.10వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదిస్తున్న ఈ పథకం అమలుకు వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు ప్రక టించారని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు