ఆ ఘటనపై కేసీఆర్‌ ఏం చెబుతారు?: రచనా రెడ్డి

4 Apr, 2018 14:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికే ‘తెలంగాణ జన సమితి’ ఆవిర్భవించిందని అడ్వకేట్‌ రచనా రెడ్డి తెలిపారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సామాజిక న్యాయమే జన సమితి లక్ష్యమని స్పష్టం చేశారు. మరో వైపు.. దేశంలో దళితులపై జరుగుతున్న దాడులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖండించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై మాట్లాడిన కేసీఆర్‌.. నేరెళ్ల దళితులపై ఇసుక మాఫియా లారీలు ఎక్కించి చంపిన ఘటనపై ఏం సమధానం చెబుతారని ప్రశ్నించారు. ఆయన మాటలకు, చేతలకు పొంతన ఉండదని ఆమె ఎద్దేవా చేశారు.

కాగా, సిరిసిల్ల జిల్లా నేరెళ్ల, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన 8 మంది దళితులు ఇసుక మాఫియాపై ప్రశ్నించినందుకు పోలీసులు అమానుషంగా వారిపై దాడి చేసిన అంశం రాష్ట్రంలో వివాదస్పదమైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులైన వారిని జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌ రక్షిస్తున్నారని అప్పట్లో తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి.

మరిన్ని వార్తలు