ఏజెంట్‌ చేతిలో మోసపోయిన జగిత్యాల వాసి

12 Nov, 2019 10:19 IST|Sakshi
జగిత్యాల వాసిని ఓదారుస్తున్న సురేష్‌

గల్ఫ్‌నుంచి తిరిగి వచ్చిన కిష్టయ్య

ఇంటికి వెళ్లేందుకు చార్జీలు లేక ఇబ్బందులు  

రెండు రోజులుగాఎయిర్‌పోర్టులోనే..

టీఆర్‌ఎస్‌ నేత చొరవతో స్వస్థలానికి

శంషాబాద్‌: ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి ఏజెంట్‌ చేతిలో మోసపోయిన ఓ బాధితుడు ఎట్టకేలకు హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు. అయితే, ఇంటికి వెళ్లేందుకు కనీస చార్జీలు లేకపోవడంతో రెండురోజులు ఎయిర్‌పోర్టులోనే తిండితిప్పలు లేకుండా పడిఉన్నాడు. జగిత్యాలకు చెందిన కిష్టయ్య నెలల కిందట ఏజెంట్‌కు రూ.50వేలు చెల్లించి దుబాయికు వెళ్లాడు. అక్కడ రెండు నెలలపాటు కూలిపని చేశాడు. ఈ సమయంలో ఏజెంట్‌కు సంబంధించిన వ్యక్తులు అతడి పాస్‌పోర్టు, వీసాలతో పాటు పనిచేసిన డబ్బులు కూడా తీసుకున్నారు. పాస్‌పోర్టు, వీసా లేకుండా తిరగడంతో అక్కడి ప్రభుత్వం అతడిని మూడునెలల పాటు జైలులో ఉంచింది. అక్కడి ఇండియన్‌ ఎంబసీ అధికారులు అతను పనిచేసిన కంపెనీ నుంచి టికెట్‌ ఇప్పించి హైదరాబాద్‌కు పంపారు. రెండురోజుల కిందట శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న కిష్టయ్య వద్ద ఇంటికి వెళ్లేందుకు కనీస చార్జీలు కూడా లేకపోవడంతో ఎయిర్‌పోర్టు లాన్‌లోనే కాలం వెళ్లదీసాడు. సమాచారం తెలుసుకున్న ఊట్‌పల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ నేత రాచమల్ల సురేష్‌ అతడికి భోజనం పెట్టించి ప్రయాణ చార్జీలు అందజేయడంతో అతడు జగిత్యాల బయలుదేరాడు.

మరిన్ని వార్తలు