ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం

8 Jul, 2014 02:27 IST|Sakshi

 మోర్తాడ్ :  వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలై నెల రోజులు గడుస్తున్నా వర్షాల జాడ లేక పోవడంతో రైతుల్లో నైరాశ్యం నెలకొంది.

వేసవి కాలం మాదిరిగా ఎండలు కాస్తున్నాయి. గత సంవత్సరం అతివృష్టి కారణంగా భూగర్భ జలాలు బాగానే ఉన్నా భూమి లో వేడిమి తగ్గని కారణంగా పంటల సాగుకు వాతావరణం అనుకూలించడం లేదు. సోయా విత్తితే మొలకెత్తని పరిస్థితి నెలకొంది. బోరుబావుల ద్వారా సోయా, వరి పంటలను సాగు చేయాలని రైతులు ప్రయత్నిస్తున్నా భూమి అనుకూలించక పోవడంతో విత్తనం వృథా అవుతోంది.

  జిల్లాలోని జక్రాన్‌పల్లి మండలం మిన హా అన్ని మండలాల్లో వర్షపాతం లోటు ఉంది. సాధారణ వర్షపాతానికి కనీసం 50 శాతం కూడా నమోదు కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అనేక మంది రైతులు సోయా విత్తనాలను రెండు మార్లు విత్తారు. అయినా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉండటంతో ప్రత్యామ్నా య పంటల సాగుతో రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

పెసర్లు, మినుములు సాగు చేయడానికి అనుకూలంగా వాతావరణం ఉండటంతో ఈ రెండు పంటలను సాగు చేయించి రైతాంగానికి దారి చూపాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రతి మండలంలోను వ్యవసా య శాఖ అధికారులు ఈ ఖరీఫ్ సీజనుకుగాను సోయా, వరి పంటలకు బదులు పెసర్లు, మినుములు సాగు చేయించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. రైతాంగానికి ఎంత మేర విత్తనాలు అవసరమో అంచనా వేస్తున్నారు. సోయా, వరి సాగులకు ఇంకా కొంత సమయం ఉన్నా ముందు ముందు ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలి యదనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళి కను సిద్ధం చేస్తున్నారు.

ఒక వేళ వర్షాలు కురిస్తే సోయా, వరి సాగుకు అవసరం అయిన విత్తనాలు రైతుల వద్ద రెడీగా ఉన్నాయి. రెండు, మూడు భారీ వర్షాలు కురిసే వరకు రైతులు కాస్తా ఓపిక పట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో వ్యవసాయ శాఖ అధికారులు ముందు జాగ్రత్తగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రణాళికను సిద్ధం చేసి ఉంచు తున్నారు.

మరిన్ని వార్తలు