గ్రేటర్లో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం
2030 నాటికి ఢిల్లీ స్థాయిలో నమోదయ్యే ప్రమాదం
వాయు నాణ్యతా సూచీలో గ్రేటర్ నెం.4
ఢిల్లీ, కోల్కతా, చెన్నై నగరాలకు తొలిమూడు స్థానాలు
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదికలో వెల్లడి
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో మానవాళి మనుగడకు అత్యావశ్యకమైన స్వచ్ఛ వాయువు క్రమంగా కనుమరుగవుతోంది. ఏడాదిలో సగం రోజులు.. అంటే 183 రోజులు గ్రేటర్ వాసులు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అంతేకాదు వాయునాణ్యతా సూచీలో గ్రేటర్ సిటీ దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే నాలుగోస్థానంలో నిలిచింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం స్పష్టమైంది. పీల్చే గాలిలోని సూక్ష్మ, స్థూల ధూళికణాలు, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ సహా ఇతర కాలుష్య కారకాలను పరిగణలోకి తీసుకొని సీపీసీబీ తాజాగా వాయునాణ్యతా సూచీ(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్)ను విడుదల చేసింది. ఇందులో గ్రేటర్ నగరం 115 పాయింట్లు సాధించి నాలుగోస్థానంలో నిలిచింది. మన నగరంలో పరిస్థితి ఇప్పటికే శృతిమించకపోయినా 2030 నాటికి వాయు కాలుష్యంలో ఢిల్లీకి దీటుగా నిలవనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
ప్రస్తుతం దేశరాజధాని ఢిల్లీలో 292 పాయింట్లు సాధించి అధ్వాన వాయు నాణ్యతతో ఈ జాబితాలో తొలిస్థానం దక్కించుకోవడం గమనార్హం. ఈ నగరం అత్యంత హానికరమైన వాయు కాలుష్యంతో సతమతమౌతున్నట్లు ఈ నివేదిక తేల్చింది. మెట్రో నగరాల్లో ఢిల్లీలో వాయు నాణ్యత అత్యంత దుర్భరంగా ఉందని తెలిపింది. ఇక రెండోస్థానంలో నిలిచిన కోల్కతాలో 229 పాయింట్లు, మూడోస్థానంలో ఉన్న చెన్నైలో వాయు నాణ్యతాసూచి 132 పాయింట్లుగా నమోదైంది. ఇక మన పొరుగునే ఉన్న బెంగళూరు 84 పాయింట్లు సాధించి వాయు నాణ్యత పరంగా సంతృప్త స్థాయిలో ఉండడం విశేషం. నవీ ముంబాయి సైతం 70 పాయిట్లతో సంతృప్తికర వాయు నాణ్యత సాధించింది. దేశంలో భివాండీ అత్యంత అధ్వాన్నమైన వాయునాణ్యతతో సతమతమౌతోంది. ఈ నగరంలో వాయు నాణ్యత సూచీ 412గా నమోదవడం గమనార్హం. ఇక గుర్గావ్లో 305, కాన్పూర్లో 307 పాయింట్ల మేర వాయు నాణ్యతా సూచీ నమోదైనట్లు సీపీసీబీ తాజా నివేదిక తెలిపింది.
గ్రేటర్లో వాయు కాలుష్యానికి కారణాలివే..
మహానగరంలో పలు కూడళ్లలో వాయు కాలుష్యం అవధులు దాటుతోంది. గ్రేటర్ పరిధిలో సుమారు 50 లక్షలకు పైగా ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగ, ట్రాఫిక్ రద్దీలో రహదారులపై రేగుతున్న దుమ్ముతో సిటీజన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ప్రస్తుతం వాతావరణంలో అస్థిర పరిస్థితులు నెలకొనడం మరోవైపు వాయుకాలుష్య తీవ్రత పెరగడంతో సిటీజన్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నగరంలో పలుప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లోచెత్తను తగులబెట్టడంతో కాలుష్య తీవ్రత పెరుగుతోంది. పరిశ్రమలు వెదజల్లుతోన్న కాలుష్యంతో సమీప ప్రాంతాలు పొగచూరుతున్నాయి. శివారుప్రాంతాల్లో నిర్మాణ సంబంధ కార్యకలాపాలు పెరగడంతో సూక్ష్మధూళికణాలు పీల్చే గాలిలో చేరి సమీప ప్రాంతాల్లోని సిటీజన్ల ఊపిరితిత్తులోకి చేరుతున్నాయి. ఘణపు మీటరు గాలిలో సూక్ష్మధూళికణాలు(పీఎం2.5) మోతాదు 40 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ పలు కూడళ్లలో పలుమార్లు అంతకు రెట్టింపు స్థాయిలో ధూళికాలుష్యం నమోదవుతోంది.
బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, చార్మినార్, ప్యారడైజ్, జూపార్క్, పంజగుట్ట, కూకట్పల్లి, చిక్కడపల్లి, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో వాయుకాలుష్యం శృతిమించుతున్నట్లు తేలింది.
♦ ముఖ్య కూడళ్లలో ఏడాదికి సగం రోజులు అంటే 183 రోజులపాటు కాలుష్య మేఘాలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు బయటపడడం గమనార్హం.
♦ బాలానగర్, ఉప్పల్ ప్రాంతాల్లో ఏడాదికి 200 రోజులకు పైగానే కాలుష్య ఉధృతి అధికంగా ఉన్నట్లు తేలింది.
♦ గ్రేటర్ పరిధిలో రాకపోకలు సాగించే 50 లక్షలవాహనాల్లో ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు,120.45 కోట్ల లీటర్ల డీజిలును వినియోగిస్తుండడంతో పొగ తీవ్రత ఏటేటా పెరుగుతూనే ఉంది.
♦ వాహనాల నుంచి వెలువడుతున్న పొగ నుంచి కార్భన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్డయాక్సైడ్, అమ్మోనియా, బెంజీన్, టోలిన్, ఆర్ఎస్పీఎం(ధూళిరేణువులు) వంటి కాలుష్య ఉద్ఘారాలు వాతావరణంలో చేరి నగర పర్యావరణం పొగచూరుతోంది.
ఆరోగ్యానికి ముప్పు ఇలా..
♦ పీఎం10,పీఎం 2.5,ఆర్ఎస్పీఎం సూక్ష్మ,స్థూల ధూళి రేణువులు పీల్చేగాలిలో చేరి నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాసకోశవ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్కు కారణమౌతున్నాయి.
♦ దుమ్ము, ధూళి కళ్లలోకి చేరి రెటీనా దెబ్బతింటుంది.
♦ చికాకు, అసహనం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది.
♦ తలనొప్పి, పార్శ్వపు నొప్పి కలుగుతుంది.
♦ దూళి కాలుష్య మోతాదు క్రమంగా పెరుగుతుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరిగే ప్రమాదం పొంచి ఉంది.
♦ ఇటీవల నగరంలో శ్వాసకోశ సమస్యలు, అస్తమా,క్రానిక్ బ్రాంకైటిస్,సైనస్ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులు, వాయుకాలుష్యమే.
స్వచ్ఛగాలిలో మన మెక్కడ..?
హైటెక్ సిటీలో నీళ్లు...పాలు...ఆహార పదార్థాలు...వీటన్నింటి నాణ్యతను తెలుసుకునేందుకు గ్రేటర్లో పలు ప్రయోగశాలలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఏ ప్రాంతంలో ఏ సమయంలో ఏఏ కాలుష్యం ఎంత మోతాదులో వెలువడుతోంది ..? ఈ కాలుష్యం బారి నుంచి రక్షణ పొందేందుకు పౌరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...? అన్న అంశం గ్రేటర్ సిటీజన్లకు ఎండమావిలా మారింది. పేరుగొప్ప విశ్వనగరంలో నిరంతర వాయు కాలుష్య నమోదుకేంద్రాల ఏర్పాటు..వాయు కాలుష్య వివరాలను మొబైల్యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం కల్పిస్తామని కాలుష్య నియంత్రణ మండలి ఏడాదిగా చెబుతూ వస్తోంది. క్యాలెండర్లో రోజులు మారుతున్నా...ఈ అవకాశం ఏడాదిగా అందని ద్రాక్షలా మారడం శాపంగా పరిణమిస్తోంది.
అధిక వాయు కాలుష్యం వెలువడే ప్రాంతాలివే...
బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, ప్యారడైజ్, జేబీఎస్, ఎంజీబీఎస్, నాంపల్లి, చార్మినార్, జీడిమెట్ల, ఆర్టీసీ క్రాస్రోడ్స్, ఎల్బీనగర్, మాదాపూర్, హైటెక్సిటీ, నాచారం, మల్లాపూర్, అబిడ్స్, కేబీఆర్పార్క్, పంజగుట్ట, హెచ్సీయూ, గచ్చిబౌలి, మెహిదీపట్నం, దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో వాయుకాలుష్యం అత్యధికంగా ఉంది.