కేంద్ర సర్వీసులకు అకున్‌! 

24 Oct, 2019 03:45 IST|Sakshi

గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

మున్సిపల్‌ ఎన్నికల తర్వాతే ఐపీఎస్‌ల బదిలీలు?  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీసు శాఖలో బుధవారం పలు ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఉన్న డీఐజీ అకున్‌ సబర్వాల్‌ను కేంద్ర సర్వీసులకు పంపేందుకు రాష్ట్ర హోంశాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఆయనను రిలీవ్‌ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్లు సమాచారం. సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీసులోకి ఆయన వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆయన దరఖాస్తును చాలా నెల లుగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచు తూ వస్తోంది. ఇక అకున్‌ సబర్వాల్‌ స్థానంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సత్యనారాయణరెడ్డి బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. గతంలో నల్లగొండ కలెక్టర్‌గా సత్యనారాయణ రెడ్డి పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న రాజీవ్‌ త్రివేదిని జైళ్ల శాఖ డీజీగా బదిలీ చేశారు.

కేంద్ర సర్వీసులకు వెళ్లాలని దరఖాస్తు చేసుకున్న ఏడీజీ సౌమ్య మిశ్రాపై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ (టీఎస్‌పీఏ) మాజీ డైరెక్టర్‌ సంతోష్‌ మెహ్రా కూడా కేంద్ర సర్వీసులకు వెళ్లే యోచనలో ఉన్నారు. వాస్తవానికి ఐపీఎస్‌ బదిలీలు గత ఏప్రిల్‌లో జరగాల్సి ఉన్నా ఎన్నికల కోడ్‌ కారణంగా నిలిచిపోయాయి. అదే నెలలో పదోన్నతులు పొందిన చాలామంది ఐపీఎస్‌ అధికారులు ఇంకా పాత పోస్టింగ్‌ల్లోనే కొనసాగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసే అవకాశం కనిపించడం లేదు. మున్సిపల్‌ ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయిలో బదిలీలు, కొత్త పోస్టింగ్‌లు ఉంటాయని సమాచారం. 

మరో ముగ్గురి బదిలీలు.. 
వీరితోపాటు మరో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను హోంశాఖ బదిలీ చేసింది. మహబూబాబాద్‌ అడిషనల్‌ ఎస్పీగా ఉన్న ఆర్‌ గిరిధర్, నిర్మల్‌లో అడిషనల్‌ ఎస్పీగా ఉన్న బి.రాజేశ్, సైబరాబాద్‌ సీపీ అటాచ్‌మెంట్‌లో ఉన్న అడిషనల్‌ డీసీపీ జె.రాఘవేంద్రరెడ్డిలను టీఎస్‌పీఏ అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా నియమించింది.

మరిన్ని వార్తలు