రవిప్రకాశ్‌కు మరో షాక్‌

14 Jun, 2019 19:52 IST|Sakshi

కార్లను స్వాధీనం చేసుకున్న అలంద మీడియా

సాక్షి, హైదరాబాద్‌: ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు మరో షాక్‌ తగిలింది. ఆయన వాడుతున్న ఖరీదైన కార్లను అలంద మీడియా యాజమాన్యం స్వాధీనం చేసుకుంది. టీవీ9 నుంచి అలంద మీడియా రవిప్రకాశ్‌ను తొలగించినప్పటికీ.. కంపెనీ వాహనాలను మాత్రం తిరిగి ఇవ్వలేదు. దీంతో యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. తమ వాహనాలకు తిరిగి ఇప్పించాలని వారు కోర్టును కోరారు. రవిప్రకాశ్‌ వాడుతున్న ఖరీదైన వాహనాలకు అలంద మీడియా యాజమాన్యానికి తిరిగి ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో కార్లను స్వాధీన పరుచుకున్నారు. కోర్టు ఆదేశాలతో రవి ప్రకాశ్‌ ఇంటికి చేరుకున్న పోలీసులు ముందుగా కార్లను సీజ్‌ చేశారు. ఆయన డ్రైవర్స్‌ ఫోన్లను తీసుకున్నారు. అయితే ముందస్తు నోటీసులు లేకుండా ఇంటికి ఎలా వస్తారని రవిప్రకాశ్‌ భార్య పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన రవిప్రకాశ్‌కు బెయిల్‌ మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని, కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండేలా చేయగలరని ఆయనకు బెయిల్‌ ఇవ్వద్దని ఇదివరకే న్యాయవాదులు కోరిన విషయం తెలిసిందే. రవిప్రకాశ్‌పై వచ్చిన ఆరోపణలను విచారిస్తున్న ధర్మాసనం ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం.. కేసు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించింది.

మరిన్ని వార్తలు