జోరుగా ‘బెల్ట్‌’ దందా

14 Oct, 2017 16:23 IST|Sakshi

షాబాద్‌(చేవెళ్ల): షాబాద్‌ మండలంలో ఏ గ్రామంలో చూసినా బెల్ట్‌షాపుల దందా జోరుగా కొనసాగుతున్నాయి.  సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో పడి అసలు బెల్ట్‌షాపుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఓ వైపు ప్రభుత్వం బెల్ట్‌షాపులపై కోరడా ఝులిపించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా బెల్ట్‌షాపు నిర్వాహకులకు మాటలు చెవికెక్కడం లేదు. దీనికి తోడు ఎక్సైజ్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మండలంలోని వివిధ గ్రామాల్లో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. వేలాపాలా లేకుండా 24 గంటల పాటు లభించే మద్యం దుకాణాలు గ్రామాల్లో ఉన్నాయి. దీంతో పాటు తండాల్లో సారాబట్టిలు కూడా పెట్టి మద్యం విక్రమాలు, బెల్టుషాపుల ద్వారా బహటంగా నడుస్తున్నాయి. ఒక చిన్న పాటి గ్రామంలో 5నుంచి 10వరకు బెల్టు దుకాణాలున్నాయి. వీటిని మూసి వేయాల్సిందేనని ప్రభుత్వం అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసినా అధికారులు ఖాతరు చేయడం లేదు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని గ్రామాల్లో తాగడానికి నీరు దొరకపోయినా, మద్యం మాత్రం తప్పకుండా దొరుకుతుంది.  

పట్టించుకోని ఎక్సైజ్‌ శాఖ..  
షాబాద్‌ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మొదలుకుని అనుబంధ గ్రామాల్లో కూడా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మండల పరిదిలోని అన్ని గ్రామాలతో పాటు తండాల్లోను సారాబట్టీలు, బెల్ట్‌షాపులు జోరుగా వెలుస్తున్నాయి. వీటిని పట్టించుకోనే పర్యవేక్షించాల్సిన ఎక్సైజ్‌ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇతర ప్రాంతాల ‡నుంచి ఆటోల్లో కల్తీ మద్యం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా ఈ బెల్ట్‌ దుకా>ణాల్లో మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ మందు బాబులను దోచేస్తున్నారు. ఏదో నామమాత్రపు తనిఖీలు నిర్వహించి చూసిచూడన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి  ఈ అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాలని ఆయా గ్రామాల యువజన సంఘాల సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయమై ఎక్సైజ్‌ ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌ను వివరణ కోరగా.. గ్రామాల్లో బెల్టుషాపులు నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు