పెగ్గు మీద పెగ్గు!

22 Jul, 2015 01:25 IST|Sakshi
పెగ్గు మీద పెగ్గు!

సాక్షి, రంగారెడ్డి జిల్లా : మద్యం విక్రయాల్లో జిల్లా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మునుపెన్నడూ లేనంతగా వేల కోట్ల రూపాయలు సర్కారు ఖజానాకు చేరుతున్నాయి. రాష్ట్ర బొక్కసాన్ని భర్తీ చేసే ప్రధాన వనరు జిల్లా మద్యం విక్రయాలే. ప్రస్తుత ఏడాది గత నెలాఖరు నాటికి జిల్లాలో ఏకంగా 2,419.17 కోట్ల మద్యం వ్యాపారం సాగినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. 2014 సంవత్సరంలో 2,260.6 కోట్ల మేర వ్యాపారం సాగింది. ఈ క్రమంలో గతంతో పోలిస్తే తాజా ఏడాదిలో ఏకంగా 7 శాతం విక్రయాలు పెరగడం గమనార్హం.

 దేనికదే సాటి..
 జిల్లాలో మద్యం విక్రయాలకు సంబంధించి మూడు ఎక్సైజ్ డివిజన్లున్నాయి. మేడ్చల్ డివిజన్ పరిధిలో పట్టణ మండలాలే అధికంగా ఉండగా.. సరూర్‌నగర్, రాజేంద్రనగర్ డివిజన్ల పరిధిలో గ్రామీణ ప్రాంతాలు మిలితమై ఉన్నాయి. అయితే మద్యం విక్రయాల్లో మాత్రం అన్ని డివిజన్లు రికార్డులు తిరగరాస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం మేడ్చల్ డివిజన్‌లో 6శాతం విక్రయాలు పెరగ్గా.. సరూర్‌నగర్ పరిధిలో 5శాతం విక్రయాలు పెరిగాయి. అయితే రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలో ఏకంగా 12శాతం అమ్మకాలు పెరిగి.. ఆదాయాన్ని భారీగా పెంచేశాయి.

  బీరుదే జోరు..
 మద్యం విక్రయాల్లో బీరుదే హవా కనిపిస్తోంది. ఎక్సైజ్ అధికారుల గణాంకాల ప్రకారం గతేడాది 44.21లక్షల లిక్కర్ కేసులు విక్రయించగా.. ప్రస్తుతం 45.35 లక్షలకు పెరిగింది. ఇందులో 3శాతం పెరుగుదల నమోదైంది. అయితే బీరు విక్రయాల్లో మాత్రం భారీ పెరుగుదల కనిపిస్తోంది. గతేడాది బీరు విక్రయాలు 58.52లక్షల కేసులు ఉండగా.. ఈ ఏడాది 65.09లక్షల కేసులకు ఎగబాకింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం 11 శాతం అమ్మకాలు పెరగడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు