అన్ని మాఫియాలూ విజృంభిస్తాయి

11 Mar, 2014 01:00 IST|Sakshi

ఎన్నికల నేపథ్యంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కేంద్ర నిఘా వర్గాలు
హుండీ, హవాలా దందాలపై కన్నేయండి
అధీకృత సంస్థల లావాదేవీలూ పరిశీలించండి
ఫేక్ కరెన్సీ ముఠాలపై నిఘా ముమ్మరం చేయండి
నకిలీ మద్యం మాఫియా విజృంభించే ప్రమాదం

 
 సాక్షి, హైదరాబాద్:
ఎంపీటీసీ నుంచి లోక్‌సభ వరకు అన్ని ఎన్నికలు వరుసగా రావడంతో బందోబస్తులు, భద్రతా ఏర్పాట్లతోపాటు పైకి కనిపిం చని సమస్యలు మరెన్నో ప్రభుత్వ యంత్రాంగానికి ఉన్నాయి. వీటన్నింటికీ మించిన ఆందోళనకర కోణాలను కేంద్ర నిఘా వర్గాలు వెలుగులోకి తెచ్చాయి. ధనం, మద్య ప్రవాహాలతో పాటు వీటితో ముడిపడిన మాఫియాలు సైతం విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ మాఫియాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించాయి.
 
  ఏవైనా రెండు దేశాల మధ్య జరిగే అక్రమ ద్రవ్య మార్పిడిని హవాలా అంటారు. ఓ దేశంలోనే వివిధ ప్రాంతాల మధ్య జరిగే డబ్బు మార్పిడిని హుండీ అంటారు. సాధారణంగా ఈ రెండు మార్గాలను పన్ను ఎగ్గొట్టేందుకు వ్యాపారులు వినియోగిస్తుంటారు. ఎన్నికల సమయంలో పార్టీలు, అభ్యర్థులు అనధికారిక ఖర్చుల కోసం వీటినే ఆశ్రయిస్తారని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ రెండింటితో పాటు అధీకృత మార్పిడిదారుల లావాదేవీలనూ నిశితంగా పరిశీలించాలని సూచించాయి.
 
  భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో పాటు అనేక ఉగ్రవాద సంస్థలూ నకిలీ నోట్లను ముద్రిస్తున్నాయి. వీటిని స్థానికంగా ఏర్పాటు చేసుకున్న ముఠాల సాయంతో బంగ్లాదేశ్ మీదుగా పశ్చిమ బెంగాల్‌కు చేర్చి, అక్కడి నుంచి దేశంలోని మిగతా ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ‘ఎన్నికల ఖర్చుల’కు అవసరమైన డబ్బు కోసం అనేక మార్గాలను అన్వేషించే వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ నోట్లను భారీ స్థాయిలో చెలామణి చేయడానికి ముఠాలు ప్రయత్నిస్తాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఈ నేరాల్లో ఆరితేరిన ముఠాలతోపాటు ఎన్నికల కారణంగా పెరిగిన డిమాండ్‌ను ఆసరా చేసుకొని కొత్త ముఠాలూ పుట్టుకొచ్చే ప్రమాదముందని హెచ్చరించాయి. నకిలీ నోట్ల ముఠాలపై నిఘా ముమ్మరం చేయాలని సూచించాయి.
 
  దుబాయ్ కేంద్రంగా జరిగే హవాలా వ్యాపారంలో ప్రతి ముఠాకూ రెండు చోట్లా ఏజెంట్లు ఉంటారు. నగదు పంపాల్సిన వారు దుబాయ్‌లో ఉన్న ఏజెంట్‌కు డబ్బు అందిస్తే.. అతడి ద్వారా సమాచారం అందుకునే భారత్‌లోని ఏజెంట్ ఆ మొత్తాన్ని ఇక్కడ డబ్బు అందుకొనే వారికి ఇస్తాడు. ఇప్పుడు ఈ పంథా మారింది. దుబాయ్‌లో  ఏజెంట్లు తీసుకున్న డబ్బు అక్కడున్న మాడ్యూల్‌తో పాటు పాకిస్థాన్‌లోని ప్రధాన సూత్రధారులు పంచుకుంటున్నారు. తిరిగి భారత్‌లో చెల్లించడానికి మాత్రం ఉత్తరాదిలో ఏర్పాటు చేసుకున్న ముఠాలతో సైబర్ నేరాలు చేయించి, ఆ మొత్తాన్ని ఇక్కడ డెలివరీకి వినియోగిస్తున్నారు. ఇలాంటి ముఠాలు పెద్ద మొత్తంలో పంజా విసురుతాయని నిఘా వర్గాలు తెలిపాయి.
 
  ఓటర్లను ప్రలోభపరచడానికి మద్యాన్నీ భారీగా వినియోగిస్తుంటారు. ఖర్చు లెక్కల్లో చూపించకుండా ఉండేందుకు అనేక మార్గాల్లో మద్యాన్ని కొంటారు. దీన్ని అదునుగా చేసుకుని నకిలీ మద్యం మాఫియా కూడా రెచ్చిపోతుందని నిఘా వర్గాలు అంచనావేశాయి. మద్యం మాఫియాల ప్రభావం నేరుగా ప్రజలపై పడుతుందని, తీవ్ర దుష్పరిణామాలు సంభవిస్తాయని హెచ్చరించాయి.

మరిన్ని వార్తలు