వరంగల్ : వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ నెల 21న జరుగనున్న ఎన్నికకు సంబంధించి ప్రచారం 19వ తేదీతో ముగిసిన విషయం విదితమే. ఎన్నికల సిబ్బందితోపాటు సామగ్రి, ఈవీఎంలు శుక్రవారం సాయంత్రానికి పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకోనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
ఇందుకోసం 1778 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 6300 ఈవీఎంలను ఓటింగ్లో వినియోగించనున్నారు.ఎన్నిక సందర్భంగా పార్లమెంటరీ స్థానం పరిధిలోని పాఠశాలలకు 21న కలెక్టర్ సెలవు ప్రకటించారు. అలాగే ఓట్ల లెక్కింపు జరిగే ఎనుమాముల మార్కెట్ యార్డుకు ఈ నెల 24న సెలవు ప్రకటించారు. పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు, 24 మండలాల్లో 1,5,09, 671 మంది ఓటర్లు ఉన్నారు.