రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఉంటున్నవాళ్లంతా తెలంగాణ బిడ్డలేనని, అందుకే రామానాయుడుకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లో ఉండేవాళ్లు తాము సెటిలర్లమన్న భావన వదిలి పెట్టాలని సూచించారు. ఎప్పుడో మీ తాతలు, తండ్రుల నాడు వచ్చి ఉంటారని, ఇప్పుడు ఇక్కడి సంస్కృతికి అలవాటు పడి ఉంటారని కేసీఆర్ చెప్పారు.
తనకు కృష్ణా జిల్లాకు చెందిన సుబ్బారావు అనే స్నేహితుడున్నారని, వాళ్ల పిల్లలు సంక్రాంతికి ఊరెళ్లినప్పుడు అక్కడ మీది ఏఊరని అడిగితే హైదరాబాద్ అని చెబుతున్నారని.. ఇంతకీ ఏ ఊరని చెప్పుకోవాలంటూ ఆయన ప్రశ్నించారని తెలిపారు. సెటిలర్ల సమస్యల గురించి చర్చించేందుకు త్వరలోనే ఓ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఆమాటకొస్తే తనదీ హైదరాబాద్ కాదని, మెదక్ జిల్లా సిద్దిపేట అని.. అయినా ఇప్పుడు తన మనవడు మాత్రం తనది హైదరాబాద్ అనే చెబుతున్నాడని, ఈ ప్రాంతం వాళ్లు దేశంలో ఎక్కడున్నా తాము హైదరాబాదీలమనే చెప్పుకోవాలని అన్నారు.