ముప్పేటదాడి

13 Mar, 2015 00:29 IST|Sakshi

సాంబశివరావు ఇళ్లలో ఏసీబీ సోదాలు
ఏకకాలంలో ఐదు చోట్ల తనిఖీలు
రూ.1.30 కోట్ల అక్రమ ఆస్తుల గుర్తింపు
భవనాలు, బంగారం స్వాధీనం

 
వరంగల్ క్రైం/ఎంజీఎం : అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు పంజా విసిరారు. డీఎంహెచ్‌వో, రాష్ట్ర సంచాలకుడిగా విధులు నిర్వహించి ఇటీవల అవినీతి ఆరోపణలతో సస్పెండైన పిల్లి సాంబశివరావు స్వగృహంలో గురువారం సోదాలు చేశారు. ఈ విషయూలను ఏసీబీ కార్యాలయంలో వరంగల్ ఏసీబీ డీఎస్పీ సారుుబాబా వెల్లడించారు. ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు బృందాలుగా విడిపోరుు ఏకకాలంలో సాంబశివరావు బంధువులు, బినామీలుగా భావిస్తున్న వారి ఇళ్లపై ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు సోదాలు చేశారు. హన్మకొండలోని సర్క్యూట్ హౌస్‌లో గల ఆయన స్వగృహంతోపాటు అశోక్‌నగర్‌లో నివాసముంటున్న ఆయన సోదరుడు సారంగం ఇంటిపై, ఆరెపల్లిలోని కార్తికేయన్ ఎడ్యుకేషన్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కళాశాలలో, హైదరాబాద్ ఉప్పల్‌లోని ఫ్లాట్‌లో, సాంబశివరావుకు అత్యంత సన్నిహితుడైన జైహింద్ సెక్యూరిటీ ఏజెన్సీస్‌కు చెందిన జయేందర్‌రెడ్డి స్వగృహం, ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని మామ బబ్బెట ఉపేందర్ ఇళ్లలో మూకుమ్మడి దాడులు నిర్వహించారు.

అక్రమ ఆస్తుల చిట్టా..

పిల్లి సాంబశివరావుకు హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్‌హౌస్ సమీపంలో ఇల్లు, జేపీఎన్ రోడ్డులో రెండు కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఆరెపల్లిలో కార్తికేయన్ ఎడ్యుకేషన్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కళాశాలలు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా రూ.24 లక్షల విలువ చేసే 85 తులాల బంగారం, ఐదు కిలోల వెండి, పైడిపల్లి, జఫర్‌గఢ్‌లలో 4 ఎకరాల 30 గుంటల వ్యవసాయ భూమికి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తులు 1990 నుంచి 2000 సంవత్సరం మధ్యలో కొనుగోలు చేసినట్లు పత్రాల ద్వారా వెల్లడవుతుంది. కాగా, అప్పటి రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం రూ.1.30 కోట్లుగా నిర్ధారించారు. ప్రస్తుతం వీటి మార్కెట్ విలువ కోట్లాది రూపాయాలు ఉంటుంది. అక్రమ ఆస్తులు కలిగి ఉన్న సాంబశివరావును గురువారం సాయంత్రం ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పర్చి చర్లపల్లి జైలుకు తరలించారు.
 
బినామీలపై ఏసీబీ నజర్

ఏసీబీ అధికారులు సాంబశివరావుకు సంబంధించిన బినామీలపై దృష్టి సారించారు. అత్యంత సన్నిహితుడిగా ఉంటున్న జయేందర్‌రెడ్డి ఇంటిపై దాడి చేసి కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు బినామీలు ఉన్నట్లు గుర్తించారు. అయితే వారి ఆస్తులపై ప్రత్యేకంగా నిఘా వేసి దాడులు చేసే అవకాశం ఉంది. ఈ దాడుల్లో వరంగల్ డీఎస్పీ సాయిబాబా, కరీంనగర్, ఆదిలాబాద్ ఇన్‌చార్జి డీఎస్పీ సుదర్శన్‌గౌడ్, నల్గొండ ఏసీబీ డీఎస్పీ కోటేశ్వర్‌రావు, హైద్రాబాద్‌లో డీఎస్పీ ప్రభాకర్‌లతోపాటు సీఐ సాంబయ్య, రాఘవేందర్‌రావు, వేణుగోపాల్‌రావు పాల్గొన్నారు.
 
ఎంజీఎంలో వైద్య పరీక్షలు

సాంబశివరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న అనంతరం గురువారం రాత్రి ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ భిక్షపతిరావు సాంబశివరావుకు వైద్య పరీక్షలు చేశారు. సాంబశివరావును ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్న నేపథ్యంలో ఈ వైద్యపరీక్షలు నిర్వహించారు.
 

మరిన్ని వార్తలు