సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో కరోనా ప్రభావం అంతకంతకూ పెరుగుతుండటంతో స్థానికుల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. ఈనేపథ్యంలో కొందరు వైరస్ బారిన పడకుండా ఉండేందుకు భిన్న మార్గాలను ఎంచుకుంటున్నారు. నేరడికొండ మండల కేంద్రంలో శనివారం ఒక్కరోజే ముగ్గురికి కరోనా అని తేలడంతో వారిని ఆస్పత్రికి క్వారైంటన్కు తరలించారు. దీంతో స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. తమ ప్రాంతంలో ఏకంగా ముగ్గురికి కరోనా రావడం.. పాజిటివ్ అని తేలిన వ్యక్తులు గత పదిరోజులుగా నేరేడుకొండలో వివిధ ప్రాంతాల్లో తిరగటంతో మరికొందరికి ఈ వైరస్ సోకిందన్న అనుమానాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కరోనా పాజిటివ్ వ్యక్తులు నివాసం ఉండే మధురా నగర్ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో మధురా నగర్ చుట్టుపక్కల నివాసం ఉండే 100 నుంచి 150 కుటుంబాల వారు ఆ ప్రాంతాన్ని ఖాళీచేశారు. తమ పంటపొలాల్లో తాత్కాలిక షెడ్లు వేసుకొని వారు అక్కడే నివాసం ఏర్పరుచుకున్నారు. కాగా, శనివారం ఒక్కరోజే జిల్లాలో పదిమందికి కరోనా పాజిటివ్ అని తేలింది.