లాక్‌డౌన్‌ వేళ తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు

17 Apr, 2020 14:21 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: కరోనా లాక్‌డౌన్‌తో దేశమంతా రవాణా వ్యవస్థ స్తంభించిన వేళ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు మరణించారు. కామారెడ్డిలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు విడిచారు. గాంధారి మండలం గుడిమెట్ వద్ద ఓమ్ని వ్యాన్ బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ మృత్యువాత పడ్డారు. భర్తతో కలిసి ఓమ్నీ వ్యాన్‌లో పుట్టింటికి వెళ్తున్న గండివేట్ గ్రామానికి చెందిన మహిళ.. వారి వాహనాన్ని ఢీకొట్టిన బైకర్లు ఇద్దరు మరణించారు. అలాగే జాతీయ రహదారిపై భిక్కనూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన కూలీ చనిపోయాడు.
(చదవండి: కరోనా పరీక్షలు: నాలుగో స్థానంలో ఏపీ)

బ్యాంక్‌ వద్ద మహిళ మృతి..
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ వద్ద కన్నాపూర్ తండాకు చెందిన ఆంగొత్ కమల (45) వరుసలో నిలుచుని మృతి చెందారు. గుండెపోటుకు గురవడంతోనే ఆమె చనిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు.
(చదవండి: ‘గాంధీ’ డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా‌!)

ఒక్కసారిగా మంటలు.. ఇద్దరు మృతి
పశ్చిమ గోదావరి: స్పిరిట్‌తో వెళ్తున్న లారీ చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని అలంపురం నుంచి దువ్వ మార్గంలో ఉన్న పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. స్పిరిట్‌ లారీ చెట్టును ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. లారీలో ఉన్న ఇద్దరూ మంటలకు ఆహుతయ్యారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం వెళ్లమెళ్లి జాతీయ రహదారి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. కరోనా లాక్‌డౌన్‌  నేపథ్యంలో వలస కార్మికులు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం కాలినడకన వెళుతుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఏలూరు నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు వారిని ఢీకొంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు