కమలం వికసించేనా..!

2 Oct, 2018 07:52 IST|Sakshi
మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాపై దృష్టి సారించింది. ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి కరీంనగర్‌ నుంచే ‘ముంద స్తు’ ప్రచారానికి సిద్ధం అవుతోంది. ఆ పార్టీ జాతీ య అధ్యక్షుడు అమిత్‌ షా ముందస్తు ఎన్నికల నేపథ్యంలో దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో తొలి సభ నిర్వహించారు. రెండో సభను ఉత్తర తెలంగాణకు కీలకమైన కరీంనగర్‌ను ఎంచుకున్నారు. ఈ మేరకు ఈనెల 10న క రీంనగర్‌లో అమిత్‌ షా సభను నిర్వహించేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం కదిలి వచ్చింది. బహిరంగ సభ కోసం రెండు, మూడు ప్రాంతాలు పరిశీలనలో ఉన్నప్పటికీ.. ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల మైదానమే ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు.

అమిత్‌ షా సభకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో బీజేపీ తాజా మాజీ శాసనసభ పక్షనేత జి.కిషన్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు గుజ్జుల రామకృష్ణారెడ్డి, మంత్రి శ్రీనివాస్, జి ల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, అధికార ప్రతిని ధులు, రఘునందన్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఎస్‌.కుమార్‌ తదితరులు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ముఖ్య నేతలు, నాయకులతో కరీంనగర్‌ శ్వేత ఇంటర్నేషనల్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఈ సమావేశంలో అమిత్‌ షా సభ సక్సెస్‌ కోసం ఏర్పాట్లు, జన సమీకరణ తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది.

కదన కుతుహలంలో కమలనాథులు.. పోటీపోటీగా ఆశావహులు..
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 13 స్థానాల నుంచి బీజేపీ అభ్యర్థులను బరిలోకి దింపనుండగా.. ఆశావహులు పార్టీలో రోజురోజుకూ పెరుగుతున్నారు. రాష్ట్ర నాయకత్వం జిల్లా కమిటీలకు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 15 రోజుల నుంచే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. పార్టీ సీనియర్లు, గతంలో పోటీ చేసి గెలిచిన, ఓడిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు ఆయా నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల సామాజిక వర్గాలు, నేతల పేర్లను పరిశీలనలోకి తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాగా.. నాలు గైదు మినహా ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్‌ ఆశావహులు ఇప్పటికే ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. పెద్దపల్లి, కరీంనగర్, హుస్నాబాద్‌ టికెట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్, కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డికి ఖాయమనే చెప్తున్నారు.

వేములవాడలో ప్రతాప రామకృష్ణ, ధర్మపురిలో కన్నం అంజయ్యకు అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కాగా.. చొప్పదండి నుంచి కొరివి వేణుగోపాల్, లింగంపల్లి శంకర్, మానకొండూరు నుంచి మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, కనుమల్ల గణపలి, గడ్డం నాగరాజులు పార్టీ టికెట్‌ ఆశిస్తున్నారు. సిరిసిల్లలో ఆకుల విజయ, మేరుగు హన్మంత్‌గౌడ్, ఆడెపు రవి, జగిత్యాల నుంచి ముదుగంటి రవీందర్‌రెడ్డి, మోరపల్లి సత్యనారాయణ, కోరుట్ల నుంచి పూదరి అరుణ, బాజోజు భాస్కర్‌ పేర్లు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్‌కు కిసాన్‌మోర్చా జాతీయ కార్యదర్శి పొల్సాని సుగుణాకర్‌రావు వినిపించినా, ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో దిగేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్తున్నారు. అయితే.. ఇక్కడి నుంచి కటంగూరి అనిల్‌రెడ్డి, పుప్పాల రఘు, కనుమల్ల గణపతి, ఉప్పు రవి టికెట్‌ ఆశిస్తున్నారు.

రామగుండంలో బల్మూరి వనిత, మంథనిలో ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇదిలా వుంటే పార్టీకి సానుభూతి ఉన్న నియోజకవర్గాల్లో అసంతృప్తితో ఉన్న ఇతర పార్టీల్లోని నాయకులను సైతం చేర్చుకోవాలన్న ప్రణాళికతో కూడా బీజేపీ ఉంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే కొంత మంది నేతల జాబితాను సిద్ధం చేసుకున్న పార్టీ అధినాయకత్వం సదరు నేతలతో సంప్రదింపులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే పార్టీ మారే కొందరికీ కొత్తగా సీట్ల సర్దుబాటు చేసే అవకాశం ఉంది.

అభ్యర్థుల ఎంపికపై హైదరాబాద్‌లో  భేటీలు.. 3,4,5 తేదీలలో  కొలిక్కిరానున్న జాబితా..
‘ముందస్తు’ ఎన్నికల సమరం కోసం కమలనాథులు కదన కుతూహలంతో ఉన్నారు. అమిత్‌ షా పర్యటన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని కొన్ని బలమైన స్థానాల్లో కమలం వికసిస్తుందన్న ఆశాభా వం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ రద్దు,  ముందస్తు ఎన్నికల నిర్ణయం తర్వాత నుంచే ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు బీజేపీ దూకుడు పెంచింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 13 నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ఆ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. తెలంగా ణలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షా కనీసం 50 సభల ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 12 లేదా 15న మహబూబ్‌నగర్‌ నుంచి ఈ ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టనున్నట్లు కూడా ప్రకటించా రు.

భారీ బహిరంగ సభల ద్వారా పార్టీలో జోష్‌ పెంచేందుకు బీజేపీ అధిష్టానం ఇప్పటికే కార్యాచరణ ఖరారు చేయగా, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో నూ దూకుడు పెంచారు. రెండు దఫాలుగా రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు, పదాధికారులు, ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. ముందస్తు ఎన్నికల్లో ఏ పార్టీతోనూ కలవకుండా ఒంటరిపోరుకు నిర్ణయం తీసుకోవడంతో ఆశావహులు టిక్కెట్ల కోసం ఎవరికీ వారుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 10న అమిత్‌ షా పర్యటన ఖరారు కావడంతో ఆ పార్టీ నేతల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది. కాగా.. అభ్యర్థుల ఖరారుపై మూడు రోజులపాటు హైదరాబాద్‌ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం స్థాయి ముఖ్యులతో రాష్ట్ర నాయకత్వం సమీక్షలు జరపనున్నారు. అనంతరం అభ్యర్థుల జాబితాను కేంద్ర పార్టీకి పంపనుండగా, త్వరలోనే అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

మరిన్ని వార్తలు