సాధికారతకు సాయమేదీ?

17 Feb, 2018 03:12 IST|Sakshi

మహిళా సంఘాలకు అందని వడ్డీ లేని రుణాల సొమ్ము

ఏకంగా రూ. 1,113.04 కోట్లకు చేరిన బకాయిలు

లక్ష్యం మేరకు వార్షిక రుణ పంపిణీలోనూ వెనుకంజ

బ్యాంకులూ సరిగా రుణాలివ్వని పరిస్థితి

ఇస్తున్న రుణాల్లోనూ కొంత మేర డిపాజిట్లుగా సేకరణ

‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడి  

సాక్షి నెట్‌వర్క్‌: వాళ్లంతా పేదలు, సామాన్య, మధ్యతరగతి గృహిణులు.. మహిళా సంఘాలుగా ఏర్పడి రూపాయి, రూపాయి కూడబెడుతూ పొదుపు చేస్తున్నారు.. ఆ మొత్తానికి మరికొంత కలిపి ప్రభుత్వం రుణాలుగా ఇస్తుంది.. వడ్డీతో సహా సక్రమంగా తిరిగి చెల్లిస్తే.. వడ్డీ మేరకు సొమ్మును తిరిగి సంఘాల ఖాతాల్లో జమ చేస్తుంది. మహిళల సాధికారతకు తోడ్పాటు, ఆర్థిక వెసులుబాటు కోసం ఈ వడ్డీలేని రుణాల పథకాన్ని తెచ్చింది. ఇదంతా సాఫీగా జరిగితే సరే. కానీ ప్రభుత్వం 2015 అక్టోబర్‌ నుంచి.. అంటే దాదాపు రెండున్నరేళ్ల నుంచి మహిళా సంఘాలకు వడ్డీని రీయింబర్స్‌ చేయడం లేదు. ఇలా చెల్లించాల్సిన వడ్డీ సొమ్ము ఎంతో తెలుసా?.. ఏకంగా రూ.1,113.04 కోట్లు! వడ్డీ సొమ్ము అందకపోతుండడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఆర్థిక స్వావలంబన కోసం..
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వాలు డ్వాక్రా పథకాన్ని ప్రారంభించాయి. సాధారణంగా ఒక్కో సంఘంలో 10 నుంచి 20 మంది వరకు.. వికలాంగుల సంఘాల్లోనైతే ఐదు నుంచి ఏడుగురు సభ్యులు ఉంటారు. ఇలా గ్రూపుగా ఏర్పడే మహిళలు ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేసి.. ఆ నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. ఆ సొమ్ము ఓ నిర్ణీత స్థాయికి చేరాక.. గ్రూపులోని సభ్యులు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా రుణాలు మంజూరు చేస్తారు. ఆ రుణాన్ని వడ్డీతో సహా వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించాలి. ఇలా రుణం తీసుకున్న మహిళలు కిరాణా దుకాణాలు, పాల డెయిరీలు, టైలరింగ్‌ తదితర రంగాల్లో స్థిరపడ్డారు. అయితే మహిళలకు మరింత తోడ్పాటు అందించాలన్న ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మహిళా సంఘాలకు కేవలం పావలా వడ్డీకే రుణాలిచ్చే పథకాన్ని అమల్లోకి తెచ్చారు. తర్వాతి ప్రభుత్వాలు పూర్తిగా వడ్డీ లేని రుణాలను అమల్లోకి తెచ్చాయి. అయితే ఇందులో వడ్డీని మినహాయించడం కాకుండా.. తొలుత మహిళలు రుణాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తే, తర్వాత ఆ వడ్డీ సొమ్మును ప్రభుత్వం తిరిగి మహిళలకు అందజేసేలా నిబంధన విధించారు. మొదట్లో ఇది బాగానే సాగినా.. గత రెండున్నరేళ్లుగా మాత్రం మహిళా సంఘాలకు వడ్డీ సొమ్ము అందడం లేదు.

వడ్డీ భారంతో సతమతం 
ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ సొమ్మును చెల్లించకపోతుండడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. రూపాయి రూపాయి కూడబెట్టి వడ్డీతో సహా రుణం చెల్లించేసినా.. వడ్డీ సొమ్ము రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము తీసుకునే రుణంతో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉపాధి పొందుతున్నామని, వడ్డీ తమకు భారంగా మారిపోతోందని చెబుతున్నారు. త్వరగా వడ్డీ సొమ్మును విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

వెయ్యి కోట్లకుపైగా బకాయిలు.. 
సాధారణ మహిళా గ్రూపులకు 2015 మే నుంచి.. ఎస్సీ, ఎస్టీ గ్రూపులకు 2015 జూలై నుంచి.. వికలాంగ గ్రూపులకు 2015 సెప్టెంబర్‌ నుంచి వడ్డీ సొమ్ముల చెల్లింపు నిలిచిపోయింది. ఇలా ఇప్పటివరకు తొమ్మిది పాత జిల్లాల్లో కలిపి బకాయిలు  రూ.1,149.34 కోట్లకు చేరాయి. ఇందులో అత్యధికంగా పాత నల్లగొండ జిల్లాలో రూ.333.15 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. పాత మెదక్‌ జిల్లాలో రూ.207.83 కోట్లు బకాయిలు ఉన్నాయి. 

లక్ష్యం మేర రుణాల మంజూరూ లేదు 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18)లో మహిళా సంఘాలకు రూ.6,979.56 కోట్లు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ ఇప్పటివరకు రూ.4,354.54 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే 62 శాతమే రుణాలు అందాయి. మిగిలింది నెలన్నర రోజులే. ఈ సమయంలో ఇంకా రూ.2,625.02 కోట్ల (38 శాతం) రుణాలు ఇవ్వడం సాధ్యమయ్యే పనికాదని అధికారులే పేర్కొంటున్నారు. 

రుణాలూ సరిగా అందని స్థితి 
గతంలో మహిళా సంఘాల వారీగా, పొదుపు చేసిన సొమ్ము ఆధారంగా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు ఇచ్చేవారు. ప్రస్తుతం గరిష్టంగా రూ.7.5 లక్షల వరకు రుణం ఇస్తున్నారు. కానీ బ్యాంకర్లు రకరకాల కారణాలు చెబుతూ రుణాలను సరిగా మంజూరు చేయడం లేదు. కొన్ని చోట్ల ఏదైనా గ్రామంలో ఒక మహిళా సంఘం సరిగా రుణం చెల్లించకుంటే.. ఆ గ్రామంలోని మొత్తం సంఘాలకు కూడా రుణాలు ఇచ్చేందుకు విముఖత చూపిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరికొన్ని చోట్ల బ్యాంకర్లు రుణంలో కొంత సొమ్మును ఖాతాలోనే డిపాజిట్‌గా ఉంచాలని మెలిక పెడుతున్నారు. దీంతో మహిళా సంఘాల సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల బ్యాంకులో డిపాజిట్‌ చేయగా మిగిలిన సొమ్మును తలా కొంత పంచుకుని అవసరాలకు వాడుకుంటున్నారు. దీంతో మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యం నీరుగారిపోతోంది. 

రూపాయి రూపాయి పోగేసి కడితే.. 
ప్రభుత్వం నుంచి స్వయం సహాయక సంఘాలకు చెల్లించాల్సిన వడ్డీ బకాయిల కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాం. మా వీఓ పరిధిలో 29 సంఘాలు ఉన్నాయి. వాటికి ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల వరకు వడ్డీ సొమ్ము రావాల్సి ఉంది. రూపాయి.. రూపాయి పోగేసి బ్యాంకులకు చెల్లింపులు చేస్తున్నాం.. అయినా వడ్డీ సొమ్ము విడుదల చేయడం లేదు..   
 – సీహెచ్‌.వెంకటలక్ష్మి, వీఓ, నాయుడుపేట, ఖమ్మంజిల్లా 

రుణం మొత్తం తీర్చేసినా.. 
మాది బోధన్‌ మండలం ఆచన్‌పల్లి. పది మందిమి కలసి విజయ మహిళా పొదుపు సంçఘం ఏర్పాటు చేసుకున్నాం. 2014లో బోధన్‌ స్టేట్‌ బ్యాంకు నుంచి రూ.5 లక్షల రుణం తీసుకున్నాం. క్రమం తప్పకుండా అసలు, వడ్డీ చెల్లించాం. 2017 మార్చిలో మరోసారి రూ.5 లక్షల రుణం తీసుకుని, కడుతున్నాం. ఇప్పటివరకు వడ్డీ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దీంతో మాపై భారం పడుతోంది..
– రత్నకుమారి, విజయ మహిళా పొదుపు సంఘం లీడర్, ఆచన్‌పల్లి, నిజామాబాద్‌ జిల్లా 

 రూ.1.22 లక్షలకు వచ్చింది రూ.11 వేలే.. 
నల్లగొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పల గ్రామ వికాస సమభావన సంఘం సభ్యులు 2015 సెప్టెంబర్‌ 23న ఇదే గ్రామ ఏపీజీవీబీలో రూ.5 లక్షలు రుణం తీసుకున్నారు. క్రమం తప్పకుండా అసలు, వడ్డీ సొమ్ము చెల్లిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వారు చెల్లించిన వడ్డీ రూ.1,22,812. కానీ సంఘానికి ప్రభుత్వం నుంచి అందిన వడ్డీ రూ.10,993 మాత్రమే. అంటే రూ.1,11,881 వడ్డీ సొమ్ము అందాల్సి ఉంది. సక్రమంగా రుణం చెల్లిస్తున్నా.. వడ్డీ సొమ్ము అందడం లేదని సంఘం సభ్యులు మునుకుంట్ల మమత, గోగిరెడ్డి ప్రమీల ఆవేదన వ్యక్తం చేశారు.     
 - వికాస్‌ సమభావన సంఘం సభ్యులు, గట్టుప్పల, నల్లగొండ జిల్లా 

మూడేళ్లుగా వడ్డీ రావట్లేదు 
మాది రాజన్న సిరిసిల్ల జిల్లా గాలిపల్లి. ప్రియదర్శిని మహిళా సంఘంలో సభ్యురాలిని. ఇప్పటికి రెండు మూడు సార్లు రుణం తీసుకుని వడ్డీతో సహా కట్టేసిన. కానీ మూడేళ్లుగా వడ్డీ సొమ్ము రావడం లేదు. ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలిస్తున్నామని చెబుతోంది. కానీ మాకు మాత్రం అందడం లేదు..
    – భట్టు పద్మ, గాలిపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా 

మరిన్ని వార్తలు