అంగన్‌వేడి

8 Jul, 2014 02:24 IST|Sakshi

కలెక్టరేట్ : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు సోమవారం కలెక్టరేట్‌ను  ముట్టడించారు. అంతకుముందు నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అయితే పోలీసులు ముందుజాగ్రత్తగా ప్రధాన ద్వారం ముందు ముళ్ల కంచెలు వేసి, అంగన్‌వాడీ కార్యకర్తలను నిలువరించారు. పది మంది మాత్రమే లోపలకు వెళ్లి తమ సమస్యలను అధికారులకు చెప్పుకోవాలని పోలీసులు సూచించారు.

 దీంతో పది మంది అంగన్‌వాడీ కార్య కర్తలు డీఆర్వో రాజశేఖర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా సీఐటీయూ నాయకులు రమేష్‌బాబు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్నప్పుడు  అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఎంతోకాలంగా సమస్యలు పరిష్కరించాలని పోరాటం చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

 పట్టణ ,గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులకు, బాలింతలకు, ఆరేళ్లలోపు  పిల్లలకు సేవలందించడంలోనూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలోనూ అంగన్‌వాడీల పాత్ర కీలకమన్నారు.దళిత,గిరిజన,బడుగు,బలహీన వర్గా లు అధికంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ ఉద్యోగుల సేవలు ప్రాధాన్యతను ప్రభుత్వం గుర్తించాలన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన అనంతరం సమస్యలను పరిష్కరిస్తామని గవర్నర్, సీఎం హామీ ఇచ్చారని, కానీ ఫలితంలేదన్నారు.

 అంగన్‌వాడీలను నాల్గో తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, నెలకు 15 వేల రూపాయల వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కరువైందని, రిటైర్మంట్ బెనిపిట్స్ కల్పించాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా  సెంటర్ అద్దెలు, బిల్లులు, టీఏ, డీఏలు ఇవ్వాలన్నారు. అమృత హస్తం బిల్లులను అంగన్‌వాడీల అకౌంట్‌లో జమ చేయాలన్నారు.  కార్యక్రమంలో నాయకులు నూర్జహన్, గోవర్ధన్, గంగాధర్, భారతి , రాజలింగం,సువర్ణ, దేవగంగుతో పాటు సుమారు రెండు వేల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు