ప్రజలను మోసగిస్తున్న ప్రభుత్వం

27 Apr, 2018 09:08 IST|Sakshi
 ఫిర్యాదు స్వీకరిస్తున్న అనిల్‌ జాదవ్‌

గుడిహత్నూర్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను నిండా మోసం చేస్తోందని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇంచార్జి అనిల్‌ జాదవ్‌ అన్నారు. మండలంలోని బెల్లూరిలో గురువారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పల్లెపల్లెకు అనిల్‌ అన్న’ కార్యక్రమంలో ఆయన  మాట్లాడారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ప్రజల జీవితాలతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆడుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రం సాధించుకున్నామన్న ఆనందం రాష్ట్ర ప్రజల్లో ఎక్కడా కన్పించడం లేదని, ప్రభుత్వ పాలన తీరుతో ప్రజలు విసుగెత్తి పోతున్నారన్నారు.

అనవసర పథకాలు, కార్యక్రమాలు చేపట్టి ప్రజాధనాన్ని కొల్లగొడుతూ... కమీషన్ల ద్వారా సొంత బడ్జెట్‌ పెంచుకుంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు తమకు అర్హతలు ఉన్నప్పటికీ మూడెకరాల భూమి, డబుల్‌బెడ్‌రూం ఇవ్వడంలేదని గోడు వెల్లబోసుకున్నారు. ప్రతిపక్షాలైన మీరైనా న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ తిరుమల్‌గౌడ్, మన్నూర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ కేంద్రే వెంకట్రావ్, నాయకులు భీంరావ్‌ నాయక్, తెలంగే మాధవ్, దోమకొండ సుధాకర్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు