వాగు దాటి.. వైద్యం అందించి..!

23 Aug, 2019 12:07 IST|Sakshi

సాక్షి, కెరమెరి(ఆసిఫాబాద్‌) : ఇటీవల కురుస్తున్న వానలకు పొంగిపొర్లుతున్న వాగులను సైతం లెక్కచేయకుండా వైద్య సిబ్బంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన సుమారు 30కు పైగా గ్రామాలు వాగు అవతల ఉండడంతో ఈ కష్టాలు నిత్యం తప్పడం లేదని సిబ్బంది వాపోతున్నారు. కెరమెరి ప్రాథమిక కేంద్రం ఆధ్వర్యంలో ఏఎన్‌ఎం సుమలత, హెల్త్‌ అసిస్టెంట్లు వసంత్, శత్రుఘన్‌ గురువారం మండలంలోని కరంజివాడ వాగును దాటి వైద్య సేవలిందించారు. నడుము వరకు నీళ్లు ఉన్నప్పటికీ లెక్క చేయకుండా ఆంద్‌గూడ, గోండ్‌ కరంజివాడ, పెద్ద కరంజివాడ గ్రామాలకు వెళ్లి 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరుగురి రోగుల నుంచి రక్త పూతలు సేకరించారు. నలుగురి గర్భవతులకు పరీక్షలు నిర్వహించి మాత్రలు అందించారు.  

మరిన్ని వార్తలు