జగ్జీవన్‌రామ్ సేవలు మరువలేనివి

6 Apr, 2014 03:05 IST|Sakshi

ఇందూరు, న్యూస్‌లైన్ : భారత రాజ్యాంగం దేశానికి వెన్నెముకలాంటిది. అలాంటి రాజ్యాంగానికి రూపకల్పన చేసిన వారిలో బాబూ జగ్జీవన్‌రామ్ ఒకరని జిల్లా కలెక్టర్ పీ.ఎస్. ప్రద్యుమ్న అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం బాబూ జగ్జీవన్‌రామ్ 107వ జయంతి సభలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
 
దేశం లో రాజకీయ స్వాతంత్య్రం ఉంటే సరిపోదని, ప్రజలకు ఆర్థిక, సామాజిక, సమన్యాయ స్వాతంత్య్రం కావాలని జగ్జీవన్‌రామ్ పోరాడి సాధించారని అన్నారు. ఆయన పోరాట ఫలి తంగానే రాజ్యాంగంలో పలు అంశాలను చేర్చడంతో నేడు మనమందరం స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నారు. బీహార్‌లో జన్మించిన జగ్జీవన్ రామ్ కేంద్రానికి మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారని అన్నారు.
 
తరువాత వ్యవసాయ మంత్రిగా ప్రజల మేలు కోరి దేశ చరిత్రలో గొప్ప వ్యక్తిగా నిలి చారని కొనియాడారు. అయితే ప్రస్తుత తరం దేశ కోసం పోరాడిన మహనీయులను మరిచి పోతోందన్నారు. విద్యార్థులకు మహనీయుల పేర్లు కూడా తెలియని పరిస్థితి నెలకొనడం చాలా విచారకరమన్నారు. జిల్లా ఎస్పీ తరుణ్ జోషి మాట్లాడుతూ  బాబూ జగ్జీవన్ రామ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. జేసీ వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ అంటరాని తనాన్ని రూపు మాపేందుకు పోరాటం చేసిన బాబూ జగ్జీవన్ రామ్ అడుగు జాడల్లో నడవాలన్నారు.
 
అంటరానితనం అక్కడక్కడా ఇంకా ఉందని,దానిని పూర్తి స్థాయిలో నిర్మూలించేదుకు జిల్లా యంత్రాగం చర్యలు చేపడుతుందన్నారు. స్థానిక రైల్వే కమాన్ వద్ద పాత అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ ఖాలేబ్, ఐకేపీ పీడీ వెంకటేశం, ఇన్‌చార్జి డీఎస్‌డబ్ల్యూఓ అల్ఫోన్స్, ఏఎస్‌డబ్ల్యూ జగదీశ్వర రెడ్డి,కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు కలెక్టర్ రైల్వే కమాన్ చౌరస్తాలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాలలు వేశారు. అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన చిత్ర పటానికి పూల మాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు.
 
మాజీ ఎంపీ మధుయాష్కీ నివాళి..
రైల్వే కమాన్ చౌరస్తాలోని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి మాజీ ఎంపీ మధుగౌడ్ యాష్కీ పూల మాలలు వేసి వివాళులు అర్పించారు. అనంతరం అంబేడ్కర్ భవన్‌లోని చిత్ర పటానికి పూల మాలలు వేశారు. సాంఘిక సంక్షేమాధికారులు భోజనాలు ఏర్పాటు చేయగా, విద్యార్థులు, ఉద్యోగులతో పాటు కలిసి భోజనం చేశారు. కాగా అక్కడున్న ఓ వృద్ధురాలిలో కలిసి ముచ్చటిస్తూ భోజనం చేసి అందరిని ఆకట్టుకున్నారు.

మరిన్ని వార్తలు