పాలిసెట్‌ ఫలితాల ప్రకటన

27 Apr, 2019 01:51 IST|Sakshi

92.53 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత

ఆరుగురికి మొదటి ర్యాంకు

మే తొలివారంలో కౌన్సెలింగ్‌

జూన్‌ 1 నుంచి తరగతులు

సాక్షి, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్‌–2019 ఎంట్రన్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. 1,03,587 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 95,850 (92.53 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పాలీసెట్‌ ఉత్తీర్ణతలో అమ్మాయిలే పైచేయి సాధించారు. 61,505 మంది బాలురకు గాను 55,933 (90.94 శాతం) మంది ఉత్తీర్ణులు కాగా, 42,082 మంది బాలికలకు గాను 39,917 (94.86 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. పాలీసెట్‌లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 99.99 శాతం ఉత్తీర్ణత సాధించారు.

16,704 మంది ఎస్సీ విద్యార్థులకు గాను 16,702 మంది, 9,620 మంది ఎస్టీ విద్యార్థులకు గాను 9,619 మంది పాసయ్యారు. పాలిటెక్నిక్‌ కాలేజీలకు గుర్తింపు జారీ ప్రక్రియ ఈ నెలాఖరుకు ముగుస్తుందని, మే తొలి వారంలో పాలీసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి చైర్మన్‌ నవీన్‌ మిట్టల్‌ పేర్కొన్నారు. జూన్‌ 1 నుంచి పాలిటెక్నిక్‌ కళాశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయన్నారు.

టాప్‌ ర్యాంకర్లు ఆరుగురు
పాలీసెట్‌లో ఆరుగురు విద్యార్థులు 120కు 120 మార్కులు సాధించి 1వ ర్యాంకు సాధించారు. 9 మంది విద్యార్థులు 120కు 119 మార్కులు సాధించగా, వారిలో గణితంలో 60కు 60, భౌతిక శాస్త్రంలో 30కు 30 మార్కులు సాధించిన ముగ్గురికి ఏడో ర్యాంకు కేటాయించారు. గణితంలో 60, రసాయన శాస్త్రంలో 30, భౌతిక శాస్త్రంలో 29 మార్కులు సాధించిన 6 మందికి 10వ ర్యాంకు ఇచ్చారు. టాప్‌ 15 ర్యాంకులు సాధించిన వారిలో 11 మంది సూర్యాపేట జిల్లా విద్యార్థులే ఉండటం గమనార్హం.

మరిన్ని వార్తలు